ఎర్రగడ్డ, మే 1: బోరబండ పోలీస్ ఔట్పోస్ట్ త్వరలో పూర్తి స్థాయి ఠాణాగా ఏర్పడనున్నదని పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్ అన్నారు. బోరబండ సైట్-2 కాలనీలోని ఔట్పోస్ట్ను పంజాగుట్ట ఏసీపీ మోహన్కుమార్, ఎస్సార్నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సైదులుతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు.
ఠాణా ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఔట్పోస్ట్ ప్రాంగణంలో కలియ తిరిగి పరిశీలించటమే కాకుండా సైదులు ద్వారా మరిన్ని అంశాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఎస్సార్నగర్ ఠాణా పరిధిలోని బోరబండ ఔట్పోస్ట్ను పూర్తి స్థాయి పోలీస్స్టేషన్గా ఏర్పాటు చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలో ఏర్పడనున్న ఈ ఠాణాకు తొలుత అధికారులు, సిబ్బందిని కేటాయించే ప్రక్రియను చేపట్టనున్నట్లు వివరించారు.
ఎస్సార్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బోరబండ ఔట్పోస్ట్ దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నది. కాని ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఈ ఔట్పోస్ట్ ఎస్సార్టీనగర్లోని రెండు ఇరుకు గదులకే పరిమితమైంది. కనీసం ద్విచక్ర వాహనాల పార్కింగ్కు కూడా అవకాశం లేకపోవటంతో ఇందులో పని చేసే సిబ్బంది నానా అవస్థలు పడేవారు. ఇక రక్షక్ వాహనాన్ని ఔట్పోస్ట్ వద్ద నిలపటానికి వీలు పడేదికాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సైట్-2 కాలనీలోని విశాలమైన ప్రాంగణంలోకి దీన్ని తరలించటం జరిగింది.
ప్రస్తుతం సైట్-2 కాలనీలో కొనసాగుతున్న ఔట్పోస్ట్లో సకల వసతులున్నాయి. ఆరంభంలో ఈ ఔట్పోస్ట్ పరిధిలోని జనాభా 10-20 వేలు మాత్రమే. నేడు ఆ జనాభా 2 లక్షల వరకు చేరింది. జనాభాతో పాటు పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని బోరబండలో పోలీస్స్టేషన్ ఏర్పాటునకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. గతేడాది హోంశాఖ మంత్రి మహమూద్అలీ కూడా బోరబండ ఔట్పోస్ట్ను సందర్శించి వసతులను పరిశీలించారు.