సిటీబ్యూరో, ఫిబ్రవరి16 ( నమస్తే తెలంగాణ ) : ఎల్లుండితో బుక్ ఫెయిర్ ముగియనున్నది. ఇప్పటికే పుస్తక ప్రేమికులు ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరిన పుస్తక ప్రదర్శనలో వారికి నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తూ సందడి చేస్తున్నారు. శుక్రవారం రవ్వా శ్రీహరి వేదికపై పలు పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. ‘యువతరం కవులు అంతరంగ ఆవిష్కరణ’ అంశంపై నేటితరం యువ కవులతో చర్చా కార్యక్రమం జరిగింది. జీవితం లేకుండా కవిత్వం లేదని కాళోజీ అవార్డు గ్రహీత అమ్మంగి వేణుగోపాల్ అన్నారు.
సాహిత్యంలోని అన్ని ప్రక్రియల ద్వారా యువతరం, నవతరం కవులు గళమెత్తాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసేన్, గౌరీ శంకర్, కవి యాకూబ్, నారాయణరెడ్డి, చరణ్, రాము, కల్యాణి, శ్రీనిధి విప్లవ శ్రీ, అనూష తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాల వికాస్ కార్యక్రమంలో భాగంగా చిమ్మపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాటలు, పద్యాల పోటీల్లో విద్యార్థులు పాల్గొని ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అనంతరం మిస్టర్ చోగా పేరుగాంచిన ప్రముఖ బాల సాహితీవేత్త చొక్కాపు వెంకట రమణ ప్రదర్శించిన ఫన్నీ మ్యాజిక్ షో సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులను బుక్ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంర్ ప్రదానం చేశారు.