సిటీబ్యూరో, నవంబరు 18(నమస్తే తెలంగాణ): సాధారణంగా ఎన్నికలు అనగానే ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు రాజకీయ పార్టీలు ఉపక్రమిస్తుంటాయి. కానీ, ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో ఉల్లంఘనలు తప్పించుకోవడానికి వీల్లేదు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలుకు భారత ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఉల్లంఘనులపై ఉక్కుపాదం మోపుతున్నది. ఇప్పటి వరకు 571 ఫిర్యాదులు రాగా, వాటన్నింటినీ వంద నిమిషాల్లో పరిష్కరించడం జరిగిందని ఎన్నికల అధికారులు శనివారం తెలిపారు. సీ-విజిల్ యాప్ వినియోగంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని, బస్ షెల్టర్లు, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద, మెట్రో ఫిల్లర్స్, మెట్రో మధ్యలో ఉండే బోర్డుపై అవగాహన కల్పిస్తున్నారు.
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఏదైనా ఒక అంశంపై జరిగినా ఫిర్యాదు చేయొచ్చు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారితనం పెరిగేందుకు దోహదపడిన వారు అవుతారని అధికారులు పేర్కొన్నారు.
సీ-విజిల్ యాప్ను ఈ ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా వినియోగించుకోవచ్చు. ఈ యాప్ వినియోగంలో భాగంగా తొలుత గూగుల్ లేదా ప్లేస్టోర్లో సీ-విజిల్ యాప్ అని టైపు చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఉన్న చోట నుంచే ఫోన్ ద్వారా ప్రక్రియ చేపట్టవచ్చు. ఉల్లంఘనులకు సంబంధించిన చిత్రాలను తీసి ఫిర్యాదు చేస్తే చాలు. ఈ సమయంలో ఫిర్యాదు చేసే వ్యక్తి తమ వివరాలను నమోదు చేయాల్సిన అవసరం లేదు. వారి వివరాలు గ్రూప్లో ఉంటాయి. ఫిర్యాదుకు సంబంధించిన ఫొటో కానీ రెండు నిమిషాల నిడివితో ఉన్న వీడియోలు కానీ, యాప్లో డౌన్లోడ్ చేయాలి. వంద నిమిషాల్లో సమస్యను పరిష్కారిస్తారు. పరిష్కరించిన తర్వాత సంబంధిత ఫిర్యాదుదారుడి ఐడీకి పంపిస్తారు.
రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో పాటు సాధారణ ప్రజలు చేసిన ఫిర్యాదు ఐదు నిమిషాల్లో జిల్లా ఎన్నికల అధికారి నియంత్రణలోని మానిటరింగ్ సెల్కు వెళ్తుంది. అక్కడి నుంచి ఐదు నిమిషాల్లో క్షేత్రస్థాయి పరిశీలనలోని ఎంసీసీ, ఫ్లయింగ్ స్కాడ్లకు చేరుతుంది. వారు 15 నిమిషాల్లో క్షేత్రస్థాయి విచారణ చేస్తారు. ఆ నివేదికను 30 నిమిషాల్లో రిటర్నింగ్ అధికారికి వెళ్లేలా చూస్తారు. దానిని రిటర్నింగ్ అధికారి 45 నిమిషాల్లో పరిశీలిస్తారు. అక్కడ నిర్ధారణ కాకపోతే ఫిర్యాదు జిల్లా ఎన్నికల అధికారి పరిష్కరిస్తారు. వచ్చిన ప్రతి ఫిర్యాదుకు వంద నిమిషాల్లోనే పరిష్కారం చూపుతారు.