మేడ్చల్, జనవరి 14(నమస్తే తెలంగాణ): మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో సూక్ష్మ, చిన్న తరహా, మధ్య పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం చేయూతను ఇస్తున్నది. అందులో భాగంగానే సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరగతి పరిశ్రమల నుంచి పలువురు వ్యాపారులు తీసుకున్న వివిధ ఉత్పత్తులకు సంబంధించిన బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నది. సూక్ష్మ, చిన్న తరహా, మధ్య పరిశ్రమలు అభివృద్ధి చెందేలా తీసుకున్న ఉత్పత్తులకు చెందిన బకాయిలను వ్యాపారులు ఎగ్గొట్టకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిశ్రమల రిజినల్ కౌన్సి ల్ (పరిష్కార వేదిక) ద్వారా బకాయిలు అందించేలా చూస్తున్నది. ఉత్పత్తులు తీసుకున్న వివిధ వ్యాపారుల నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రావాల్సిన బకాయిలైన రూ.55 కోట్లు చెల్లించేలా పరిశ్రమల రిజినల్ కౌన్సిల్(పరిష్కార వేదిక)లో అవార్డు జారీ చేశా రు. దీంతో సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు రావాల్సిన రూ.55 కోట్ల బకాయిలలో రూ.26 కోట్ల బకాయిల చెల్లింపులు జరిగినట్లు అధికారులు తెలిపారు. 2018 నుంచి స్మూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రావాల్సిన బకాయిలపై ఇటివలే రిజినల్ కౌన్సిల్ (పరిష్కార వేదిక)లో పరిశ్రమల రిజినల్ చైర్మన్, మేడ్చల్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రవీందర్ అవార్డు జారీ చేశారు. సూక్ష్మ, చిన్న తరహా, మధ్య పరిశ్రమలకు రావాల్సిన బకాయిలు మేడ్చల్, యాదాద్రి, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్నాయి.
బకాయిలపై ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే చాలు..
సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరగతి పరిశ్రమలు నష్ట పోకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో చిన్న తరహా, మధ్య పరిశ్రమల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివిధ వ్యాపారులు తమ పరిశ్రమల ద్వారా తీసుకున్న ఉత్పత్తులకు సంబంధించిన బకాయిలు చెల్లించనట్లయితే పరిశ్రమ రీజినల్ కౌన్సిల్ (పరిష్కార వేదిక)లో ఆన్లైన్లో దరఖాస్తులు చేసే పరిశ్రమల ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులు, ఉత్పత్తులు తీసుకున్న వివిధ వ్యాపారులను పరిశ్రమల రిజినల్ కౌన్సిల్ (పరిష్కార వేదిక)లకు పిలిపించి పరిశ్రమల రిజినల్ కౌన్సిల్ చైర్మన్ దరఖాస్తులలో సమర్పించిన పత్రాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. తీసుకున్న నిర్ణయం మేరకు బకాయిలు తప్పని సరిగా చెల్లించాల్సి ఉంటుంది. లైనట్లయితే అసలుతో పాటు వడ్డి ఇప్పించేందకు పరిశ్రమల రిజినల్ కౌన్సిల్ (పరిష్కార వేదిక) కృషి చేస్తుంది. ఎంఎస్ఎంఈడీ 2006 యాక్ట్ ప్రకారం, తీసుకున్న ఉత్పత్తులకు వివిధ వ్యాపారులు తప్పని సరిగా చెల్లించాల్సిందే. లైనట్లయితే యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
రూ.55 కోట్ల బకాయిలు చెల్లింపులపై అవార్డు జారీ
జిల్లా వ్యాప్తంగా సూక్ష్మ, చిన్న తరహా, మధ్య పరిశ్రమలకు పలువురు వ్యాపారుల నుంచి రావాల్సిన బకాయిల చెల్లింపులకు రూ.55 కోట్లకు అవార్డు జారీ చేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు సూక్ష్మ, చిన్న తరహా, మధ్య పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. చిన్న పరిశ్రమలు వివిధ వ్యాపారులకు ఇచ్చిన ఉత్పత్తుల బకాయిలను పరిశ్రమల రిజినల్ కౌన్సిల్ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రూ.55 కోట్ల బకాయిలను వివిధ వ్యాపారులు చిన్న పరిశ్రమలకు ఇవ్వాల్సి ఉంది. రూ.55 కోట్లలో ఇప్పటి వరకు రూ.26 కోట్ల బకాయిలు చిన్న పరిశ్రమలకు చెల్లింపులు జరిగాయి. ఉత్పత్తులకు సంబంధించిన బకాయిలు చెల్లించని వ్యాపారులపై ఎంఎస్ఎంఈడీ 2006 యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. రావాల్సిన బకాయిలపై ఆన్లైన్లో దరఖాస్తులు చేస్తే చర్యలు తీసుకుంటున్నాం.