బంజారాహిల్స్, జనవరి 2: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి 250 గజాల స్థలం ఇవ్వడంతో పాటు పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉద్యమకారుల్లో ఆశలు చిగురించాయి. ఇటీవల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసేందుకు వెళ్లిన ఉద్యమకారులకు ఎఫ్ఐఆర్ నంబర్ కావాలని అధికారులు సూచించారు. దీంతో 2001నుంచి 2014దాకా తాము పాల్గొన్న ధర్నాలు, చేపట్టిన ఆందోళన కార్యక్రమాల జాబితా, పేపర్ కటింగ్స్ సేకరిస్తున్నారు.
నియోజకవర్గంలో ఉద్యమ సారధి కేసీఆర్ నివాసం ఉండటంతో ఆయన వెంట ప్రారంభం నుంచి ఉన్న పలువురు కార్యకర్తల పై కేసులు నమోదయ్యాయి. దీంతో తమకు ఇంటి స్థలాలు వస్తాయనే ఉద్దేశంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజగుట్ట, సైఫాబాద్, నారాయణగూడ పీఎస్లకు వెళ్లి కేసుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నియోజకవర్గానికి చెందిన ఉద్యమకారుల వేదిక నేతలు సి.రాంచందర్, సారంగపాణి, గుండు నర్సింహ ముదిరాజ్, రావుల విజయ్కుమార్, విష్ణునాయక్ తదితరులు బంజారాహిల్స్ పీఎస్లో తమపై నమోదైన కేసుల వివరాలను తీసుకుని అభయహస్తం దరఖాస్తులను అందజేశారు.