సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 ( నమస్తే తెలంగాణ)/కవాడిగూడ : నగరంలో దారులన్నీ ఎన్టీఆర్ స్టేడియం వైపు వెళుతున్నాయి. 36వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనకు పాఠకుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. విభిన్న రకాల సాహిత్యం అందుబాటులో ఉండటంతో అన్ని ప్రాంతాల నుంచి పిల్లలు, పెద్దలు, యువత భారీస్థాయిలో మంగళవారం ప్రదర్శనకు తరలొచ్చారు. ఈసారి ప్రదర్శనలో కొత్త ప్రచురణ సంస్థలు ఎక్కువగా వచ్చాయి. యువ రచయితలు ఎక్కువ పేజీలు ఉన్న గ్రంథాలు కాకుండా తక్కువ పేజీలతో పుస్తకాలను ముద్రించి ఆకట్టుకుంటున్నారు. మొత్తంగా పుస్తక ప్రదర్శన విజ్ఞాన జ్యోతులను వెలిగిస్తున్నది.
బాలసాహిత్యానికి డిమాండ్: హైదరాబాద్ బుక్ ఫెయిర్లో బాలల సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని స్టాల్స్ నిర్వాహకులు తెలిపారు. చిట్టి చిట్టి కథలు, కార్టూన్స్తో కూడిన సంభాషణలు, కలరింగ్ పుస్తకాలు, పజిల్స్ తదితర పుస్తకాలను తల్లిదండ్రులు తమ పిల్లల కోసం అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రతీ రోజు సుమారు 30వేలకు పైగా బాలసాహిత్య పుస్తకాలు అమ్ముడుపోతున్నాయని నిర్వాహకులు తెలిపారు. పాఠకులు 365 స్టాల్స్ కలియతిరుగుతూ.. 3 గంటలకు పైగా సమయం కేటాయిస్తుండటం విశేషం.
వెనుకబడిన కులాలు ఉన్నతంగా ఎదగాలంటే చదువులో ముందుండాలని రవ్వా శ్రీహరి నేర్పిన పాఠం విద్యార్థులు ఎప్పటికీ మరిచిపోరని వక్తలు అభిప్రాయపడ్డారు. రవ్వా శ్రీహరి వేదికపై మంగళవారం ‘రవ్వా శ్రీహరి రచనలు-విహాంగ వీక్షణం’ అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ పిల్లలమర్రి శ్రీ రాములు మాట్లాడుతూ భాషా సాహిత్యాలు ఉన్నంత వరకు రవ్వా శ్రీహరి పేరు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా ఉంటుందన్నారు. నల్గొండ జిల్లాలో ఓ సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన తెలుగు విద్యార్థులను అత్యంత ప్రభావితం చేశారని చెప్పారు. అనంతరం ప్రొఫెసర్ కె. యాదగిరి మాట్లాడుతూ.. రవ్వా శ్రీహరిపై పరిశోధన చేసే భాగ్యం తనకు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోడాక్టర్ ఎన్.రఘు, ప్రొ.హరిజారాణి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలురు గౌరీ శంకర్, బుక్ ఫెయిర్ సెక్రటరీ ఆర్.వాసు, పరిశోధక విద్యార్థి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
బుక్ ఫెయిర్లో రవ్వా శ్రీహరి వేదికపై మంగళవారం భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆలూరి విల్సన్ కవితా సంపుటి హరివిల్లును ప్రముఖ సాహితీవేత్త పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత మాణిక్య రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అలాగే డాక్టర్ మహమ్మద్ హసేన్ రచించిన సాహిత్య విమర్శనా వ్యాసాలు ‘తదేక’ను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సభలో ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వాధ్యక్షుడు సూర్యధనంజయ్, కే. ఆనందాచారి, డా.పి. సురేందర్ రెడ్డి, డా.వెల్దండ శ్రీధర్, డా.పి.మధుసూధన్ రెడ్డి, డా.ఎస్.రాజారామ్, కవి యాకూబ్, టి. భాస్కర్ రెడ్డి, అనంతోజు మోహన్కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాల వికాస్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్రాప్ట్ వర్క్స్కు విద్యార్థుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో చొక్కాపు వెంకట రమణ, కోయ చంద్రమోహన్, అనీల్, సమీర్ తదితరులు పాల్గొన్నారు. కాగా బుక్ ఫెయిర్లో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బోనాల ప్రదర్శన ఆకట్టుకున్నది.