సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): గంజాయి, డ్రగ్స్, నారోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టెన్సెస్ నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా గుర్తించాలని టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శ్యాండిల్య అన్నారు. ఉద్యోగులుగా చట్టం పరిధిలోనే పనిచేస్తూ కేసుల దర్యాప్తులో పారదర్శకతతో పాటు నేరస్తులకు శిక్ష పడేలా సమగ్య దర్యాప్తు జరపాలని శిక్షణ పొందుతున్న ఎక్సైజ్ అధికారులకు సూచించారు.
‘నారోటిక్ డ్రగ్స్ చట్టాలపై, కేసులు ఎలా రాయాలి?’ అనే అంశాలపై ఎక్సైజ్ ఆకాడమీలో శుక్రవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఎక్సైజ్ అధికారులకు సూచించారు. గంజాయి, డ్రగ్స్ను పట్టుకున్నప్పుడు ప్రాథమికంగా అవలంభించాల్సిన పద్ధతులను, పంచామా, జీడీ ఎంట్రీ, ఉన్నతాధికారుల నుంచి తీసుకోవాల్సిన అనుమతులను, ఎఫ్ఆర్ఐలో పొందుపర్చాల్సిన సమాచారం, కేసు నమోదు, చార్జీషీట్, పంచుల ఎంపిక తదితర కీలక అంశాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉదాహరణలతో వివరించారు.
నేరాలకు పాల్పడిన వారిలో శిక్షలు పడుతున్నాయనే భయం ఏర్పడితే నిషేధిత డ్రగ్స్, గంజాయి రవాణా, అమ్మకాలు, వినియోగం తగ్గుముఖం పడుతాయని డైరెక్టర్ సందీప్ శాండిల్య వివరించారు. ఈ సందర్భంగా టీజీ న్యాబ్ ఆధ్వర్యంలో చట్టాలపై ముద్రించిన పుస్తకాలను శిక్షణ పొందుతున్న ఎక్సైజ్ సిబ్బందికి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 31 మంది ఎక్సైజ్ ఏఈఎస్లు, 84మంది ఎస్ఐలతో పాటు ఆకాడమీ డైరెక్టర్ సురేష్ రాధోడ్, జాయిండ్ డైరెక్టర్ శశిధర్రెడ్డి, ఈఎస్ నంద్యాల అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.