సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు జరుగనున్న పదో తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడంపై జిల్లా పరీక్షల అధికారులు దృష్టి సారించారు. సజావుగా పరీక్షలు నిర్వహించే అంశంపై శుక్రవారం జిల్లా విద్యాధికారి, వైద్య, పోలీస్, జలమండలి, విద్యుత్, ఆర్టీసీ, పోస్టల్ వంటి పలు శాఖలకు చెందిన జిల్లా అధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి సూర్యలత సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లడుతూ జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 72,114 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ఆమె తెలిపారు. అయితే పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో మొత్తం 344 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. ఈ సమావేశంలో డీఈవో రోహిణి, జీహెచ్ఎంసీ సీఎంవోహెచ్ కె పద్మజ, టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారి సునీత, అడిషనల్ ట్రాఫిక్ డీసీపీ ప్రసాద్, ఏసీపీ మహేశ్వర్, నాగరాజు, శ్రీబాల, ఆర్టీసీ అధికారి కిషన్రావు, పోస్టల్ ఆఫీసర్ రాధాకృష్ణ, పాల్గొన్నారు.