కవాడిగూడ, ఆగస్టు 20: తెలుగు భాషను పరిరక్షించుకునేందుకు భాషా ప్రేమికులు, సాహితీవేత్తలు ఏకం కావాల్సినవసరం ఉన్నదని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. తెలుగు రాష్ర్టాలలో తెలుగు భాషా చట్టాలను పూర్తి స్థాయిలో అమలయ్యేందుకు ప్రజా ఉద్యమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం తెలుగు కూట మి, తెలుగు భాషా చైతన్య సమితి, తెలంగాణ రచయితల సం ఘం, లక్ష్యసాధన ఫౌండేషన్, సత్యాన్వేషణ మండలి, గోల్కొం డ సాహితీ, సృజన సాహితీల సంయుక్త ఆధ్వర్యంలో దోమలగూడలోని హైదరాబాద్ స్టడీ సర్కిల్లో తెలుగు భాషా చైతన్య సమితి అధ్యక్షుడు బడే సాబ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో నందిని సిధారెడ్డి మాట్లాడారు.
తెలుగు భాషను పరిరక్షించుకుంటేనే మన అస్థిత్వాన్ని కాపాడుకున్నట్లు అవుతుందన్నారు. తెలుగు మాధ్యమంలో బోధనలను కొనసాగించాలని ఆయన ప్రభుత్వాలను కోరారు. తెలుగు భాషా పరిరక్షణ కోసం సెప్టెంబర్ 5న అన్ని తెలుగు సంఘాల ప్రతినిధులు, సాహితీవేత్తలతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన అన్నారు. అదే విధంగా ఈ నెల 29న ఇందిరా పార్కులో ప్రముఖ సాహితీవేత్త గిడుగు రామ్మూ ర్తి జయంతి సందర్భంగా ఉదయం 8 గంటలకు ప్రత్యేకంగా నడక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. సమావేశంలో తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు డా॥ నాళేశ్వరం, డా॥ పద్మావతి, కోదండ రామయ్య, ప్రజ్ఞారాజు, రవీంద్ర, స్వామి, డా॥ చంద్రప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.