సిటీబ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కోణంలో రూపొందించిన సినిమాలు అనేకం వచ్చాయి. పలువురు దర్శకులు, నిర్మాతలు తెలంగాణ యాస, భాషల్లో జైబోలో తెలంగాణ, విరాటపర్వం లాంటి సినిమాలు తీశారు. అయితే సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ కోణంలో తీసిన గంటా 45 నిమిషాల నిడివిగల సినిమా పూర్తి చేయడంలో తెలంగాణ యువకుడు నిర్మాత బొమ్మక్ శివ, వరంగల్ బిడ్డ డైరెక్టర్ రాజు దుస్సా కీలకంగా వ్యవహరించారు. వన్ క్యారెక్టర్.. సింగిల్ షాట్తో 105 నిమిషాల నిడివిగల ‘105 మినిట్స్’ సినిమాను పూర్తిచేయడంలో విజయవంతమయ్యారు. ఒకే క్యారెక్టర్.. అది సింగిల్ ఉమెన్ నటించిన సినిమా ‘105 మినిట్స్’. ఒక గంటా 45 నిమిషాల్లో ఏం జరిగిందంటే.. సినిమాను ఆదరించి చూడాల్సిందేనని అంటున్నారు.
హాలీవుడ్లో చరిత్రకు పోటీగా..
ఇంతకు ముందు హాలీవుడ్లో 1917, బర్డ్ మ్యాన్ లాంటి సినిమాలు తప్ప మరేవీ రాలేదని తెలిపారు. ఇటువంటి సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్తో రూపొందించిన చిత్రాలు హాలీవుడ్ తర్వాత తెలుగులో తెలంగాణ నుంచి పూర్తి చేశామని పేర్కొన్నారు. తెలుగులోనూ ఆ విధానాన్ని చిత్ర దర్శకుడు రాజు దుస్సా చేసి నిరూపించారని పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించినట్లు తెలిపారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇలాంటి నూతన ఆలోచన, ఒరవడితో రూపొందించడం ఎంతో ధైర్యంతో కూడుకున్నదని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారని సినిమా యూనిట్ తెలిపింది. ఓ ఇంటిలో బంధీగా మారిన యువతి కథ.. 105 నిమిషాల్లో అసలేం జరిగింది ? అనే కథాంశంతో క్షణక్షణం ఉత్కంఠతతో కొనసాగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రొడ్యూసర్ బొమ్మక్ శివ, డైరెక్టర్ రాజు దుస్సా, సినీనటి హన్సిక , సంగీతం సామ్ సీఎస్, ఛాయాగ్రహణం కిశోర్ బోయిడవు వ్యవహరించారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఏదేమైనా తెలంగాణ యువత ఇలాంటి చిత్రాన్ని రూపొందించడం అభినందించదగిన విషయం.
ప్రోత్సాహం ఉంటే మరింత ముందుకు..
భారతదేశ చరిత్రలో తెలుగు చిత్రసీమలో గర్వించదగ్గ సినిమాగా నిలుస్తుందని దర్శక, నిర్మాతలు అభిప్రాయపడ్డారు. సినీ పరిశ్రమలో ప్రముఖుల ప్రోత్సాహం ఉంటే వినూత్న కథాంశాలతో మరెన్నో చిత్రాలను విజయవంతంగా రూపొందించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. గంటా 45 నిమిషాల నిడివిలో బాహుబలి, సాహో లాంటి సినిమాల్లాగే హై టెక్నాలజీతో చిన్న సినిమాను రూపొందించినట్లు దర్శక, నిర్మాతలు వెల్లడించారు.