ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి
తెలంగాణ భాషపై రెండురోజుల సదస్సు
సుల్తాన్ బజార్, ఏప్రిల్ 7: తెలంగాణ తెలుగు భాష అణచివేతకు గురైన కారణంగానే రాష్ట్ర సాధన ఉద్యమానికి నాంది జరిగిందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి పేర్కొన్నారు. నిజాం కళాశాల తెలుగు శాఖ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, తెలంగాణ సాహిత్య అకాడమీ, మూసీ సాహిత్యధారల సంయుక్తాధ్వర్యంలో ‘తెలంగాణ భాష-సమాలోచన’ అనే అంశంపై గురువారం రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, తెలంగాణ పదకోశ రచయిత, బహుభాషా వేత్త డాక్టర్ నలిమెల భాస్కర్, నిజాం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.నారాయణ, ఓయూ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకట్రెడ్డి, సదస్సు సంచాలకుడు డాక్టర్ సాగి కమలాకర్ శర్మ, నిజాం కళాశాల తెలుగు శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వేల్పుల కుమారస్వామిలతో కలిసి లింబాద్రి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం, ఆయన మాట్లాడుతూ, రాబోయే విద్యా సంవత్పరం నుంచి మూడేండ్ల తెలుగు కోర్సు ప్రవేశపెడతామని చెప్పారు. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ మాట్లాడుతూ, సంచార వృత్తులకు చెందినవారు తమ జానపద కళలతో తెలుగు భాషను కాపాడుతున్నారని చెప్పారు. ‘మన ఊరు – మన చెట్టు’ అనే అంశంపై 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో 5 లక్షల మంది విద్యార్థులు ప్రతిభను చాటుకున్నారని, ఇది దేశ చరిత్రలోనే ప్రథమమని అన్నారు. సమగ్ర తెలంగాణ నిఘంటువును తీసుకువచ్చేందుకు సకల వృత్తుల వారిని ఏకం చేస్తామని అన్నారు. ఈ సదస్సులో 40 మంది తెలంగాణ భాషపై పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఈ పత్రాలతో గ్రంథాన్ని ప్రచురించి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నిజాం కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సీవీ రంజని, డాక్టర్ పగడాల నాగేందర్, డాక్టర్ కసప నరేందర్, డాక్టర్ డి.రాంబాబు, నలిగంటి శరత్ కుమార్, డాక్టర్ డి.ఉదయభాను, డాక్టర్ అట్టెం దత్తయ్య పాల్గొన్నారు.