డార్జిలింగ్ మహిళా పోలీసులకు మూడు రోజుల ట్రైనింగ్
డెకాయ్ ఆపరేషన్ నిర్వహణ
సిటీబ్యూరో, జూన్ 25(నమస్తే తెలంగాణ): తెలంగాణ షీ టీమ్స్ మోడల్ను పశ్చిమ బెంగాల్ ఆదర్శంగా తీసుకుంది. అక్కడి మహిళల భద్రతకు మన షీ టీమ్స్ అనుసరిస్తున్న విధానాన్ని తెలుసుకునేందుకు ఆసక్తి చూపించింది. ఈ నేపథ్యంలో డార్జిలింగ్కు చెందిన మహిళా పోలీసు అధికారులు ఇక్కడి షీ టీమ్స్ విధులను అధ్యయనం చేసి.. శిక్షణ తీసుకున్నారు. డార్జిలింగ్కు చెందిన మహిళా పోలీసు అధికారులకు రాచకొండ షీ టీమ్స్ అధికారులు మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు.
ఎనిమిది అంశాల్లో..
ఈ శిక్షణలో వారికి రాచకొండ షీ టీమ్స్ డీసీపీ సలీమా, షీ టీమ్స్ అధికారులు, సిబ్బంది, కౌన్సెలింగ్ ప్రతినిధులు ముందుగా షీటీమ్స్ గురించి వివరించారు. మహిళా హక్కులు, చట్టాలు, రక్షణకు సంబంధించిన అంశాలపై కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలను తెలిపారు. డెకాయ్ ఆపరేషన్లు ఎలా నిర్వహించాలో ప్రత్యక్షంగా చూపించారు. సఖీ కేంద్రంలో మహిళల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి తెలిపారు. షీ టీమ్స్కు వచ్చే బాధితుల నుంచి ఫిర్యాదును ఎలా తీసుకోవాలి, వారికి భరోసాను ఎలా కల్పించాలి వంటి అంశాలను తెలియజేశారు. భరోసా కేంద్రంలో బాధితులకు అందుతున్న సేవల గురించి చెప్పారు. రైళ్లలో డెకాయ్ ఆపరేషన్లను ఎలా నిర్వహించాలి..పోకిరీలను ఎలా గుర్తించాలో చిట్కాలను సూచించారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాల్లో జరిగే వ్యవహారాలను వివరించారు.
డెకాయ్ ఆపరేషన్
మహిళలు, విద్యార్థినులు, యువతులను బహిరంగ ప్రదేశాల్లో ఎలా వేధిస్తారు.. వారిని ఎలా గుర్తు పట్టాలి… వారి చేష్టలకు ఆధారాలు ఎలా సేకరించాలి.. వంటి అంశాలు తెలియజేసేందుకు రాచకొండ షీ టీమ్స్ డార్జిలింగ్ పోలీసులతో కలిసి మెట్రో రైలు, పలు హాట్స్పాట్స్, బస్టాపుల్లో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించారు. అనంతరం కేసులు నమోదు, వాటి దర్యాప్తు, ఇతర చట్టపరమైన అంశాలను ఎలా పాటించాలో రాచకొండ షీ టీమ్స్ వారికి వివరించింది. శిక్షణ పూర్తి చేసుకున్న డార్జిలింగ్ పోలీసులు మన షీటీమ్స్పై ప్రశంసలు కురిపించారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.