సిటీబ్యూరో, జూలై 22(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలను ప్రజలు ఆమోదించారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినప్పటికీ తమ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా ప్రజలు బారులు తీరారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చిన తొలి రోజే ప్రజల ఆమోదం లభించినట్లుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి చెందిన అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం, హైదరాబాద్ దక్షిణ జిల్లా పరిధిలో ఒక్క రోజులోనే 40 డాక్యుమెంట్లు పూర్తి చేశారు. ఈ డాక్యుమెంట్ల ద్వారా మొత్తం రూ.2.31 లక్షల వరకు ఆదా యం వచ్చినట్లుగా అధికారులు ధ్రువీకరిస్తున్నారు.
అదే విధంగా ఇదే జిల్లాలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కూడా సగటున 25 నుంచి 30 వరకు డాక్యుమెంట్లు పూర్తి చేసినట్లుగా సంబంధిత అధికారులు తెలియజేశారు. ఈ జిల్లాలోని ఎస్ఆర్వోల వారీగా కనీసం రెండు కోట్ల వరకు రాబడి వచ్చినట్లుగా అధికారులు చెబుతున్నారు. అలాగే, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో భారీ సంఖ్యలోనే ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, ఎప్పటి లాగే ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ఎస్ఆర్వోలకు వస్తున్నారని రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ స్థితప్రజ్ఞ తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే.. గురువారం ఒక్క రోజులోనే 4,451 రిజిస్ట్రేషన్లు నమోదు చేశారు. వీటి ద్వారా 25 కోట్ల వరకు ఆదాయం వచ్చింది.