ఖైరతాబాద్: ఒక సంస్థకైనా, సంఘానికైనా, వ్యక్తికైనా సామాజిక సేవా కార్యక్రమాలతోనే ప్రజాదరణ లభిస్తుందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జైన్ సమాజ్, కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించే ఉద్దేశంతో ఖైరతాబాద్లో ఈవెనింగ్ క్లినిక్ నెలకొల్పారు.
ఇవాళ ఈ క్లినిక్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత సమాజంలోని పేదల కోసం ఖర్చు చేసినప్పుడే పేదలకు మేలు జరుగుతుందన్నారు. జైన్ సమాజ్ సేవలు అభినందనీయమని ఆయన కొనియాడారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు కిమ్స్ హాస్పిటల్, జైన్ సమాజ్ ముందుకు రావడం హర్షణీయమన్నారు.