అమీర్పేట్, ఫిబ్రవరి 22: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి, అమ్మల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అల్లం పద్మ ప్రథమ వర్ధంతి, సంస్మరణ సభ బుధవారం బేగంపేట్లోని హోటల్ హరిత ప్లాజాలో జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై అల్లం పద్మకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ‘అమ్మ .. అల్లం పద్మ యాదిలో’ పుస్తకాన్ని ఆవ్కిరించారు.
ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ తన కుటుంబానికి అల్లం పద్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మలి దశ ఉద్యమంలో ఓయూ విద్యార్థులు చేసిన సాహసోపేత నిరసన ప్రదర్శనల సమయంలో అమ్మలా వారి వెన్నంటి ఉంటూ వారి బాగోగులు చూసుకున్న అల్లం పద్మ ఔదార్యాన్ని ఎన్నటికీ మరువలేమని పలువురు విద్యార్థులు తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కాగా, అల్లం నారాయణ, పద్మ దంపతుల జీవిత విశేషాలతో కూడిన వీడియో ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలోసాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, ముఠా గోపాల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. లింబాద్రి, బుద్ధపూర్ణిమ ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య, ఘంటా చక్రపాణి, మాజీ విప్ బొడకుంట్ల వెంకటేశ్వర్లు, ఏపీ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, తెలంగాణ సీఎం పీఆర్వో రమేశ్ హజారే, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్, ఐజేయూ ఉపాధ్యక్షుడు సయ్యద్ ఉస్మాయిల్ పాల్గొన్నారు.