సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ): శాంతిని పరిరక్షించాల్సిన బాధ్యత కవులు, రచయితలపైనే ఉన్నదని ప్రముఖ కవి, గాయకుడు, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సాహిత్య అకాడమీ, సాహితీ సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతి నుంచి గోల్కొండ వరకు మహా కవియాత్ర కార్యక్రమాన్ని కారం శంకర్ సారథ్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేశపతి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ.. ఆదిలాబాద్ అడవి నుంచి ప్రేమ, కరుణ, శాంతి సందేశాన్ని మోసుకొచ్చిన పావురం హైదరాబాద్ నగరం గన్పార్కులోని అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి వాలిందన్నారు. తెలంగాణలోని కవులు, రచయితలు తమ కవిత్వం ద్వారా గంగా జెమునా తెహజీబ్ సంస్కృతిని పరిరక్షించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కవులు, రచయితలు, కళాకారుల పాత్ర అజరామరం
తెలంగాణ ఉద్యమంతో పాటు రాష్ట్ర పునర్నిర్మాణంలో కవులు, రచయితలు, కళాకారుల పాత్ర అజరామరమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. సమాజంలో శాంతిని పరిరక్షించేందుకు కలాలకు పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విద్వేషం, విధ్వంసాల నుంచి మన సమాజాన్ని రక్షించే శక్తి కవులు, రచయితలకు మాత్రమే ఉన్నదని గుర్తు చేశారు. ప్రముఖ రచయిత, కవి మాష్టార్జీ మాట్లాడుతూ.. సోక్రటీస్ జనాన్ని చైతన్యం చేసినట్లు, తెలంగాణ కవులు రచయితలు సమాజాన్ని మేల్కొల్పుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా గన్పార్కు వద్ద అమరవీరుల స్తూపానికి సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, అమ్మంగి వేణుగోపాల్, నాలేశ్వరం శంకరం, అక్షరయాన్ ఫౌండర్ ఐనంపూడి శ్రీలక్ష్మి, ప్రధాన కార్యదర్శి, ప్రముఖ కవయిత్రి విశ్వైక, కందుకూరి శ్రీరాములు, తెలుగు రాష్ర్టాల నుంచి సుమారు 150 మంది కవులు, రచయితలు, కళాకారులు నివాళులర్పించారు. అనంతరం మూడు బస్సుల్లో రవీంద్రభారతి నుంచి గోల్కొండ కోటకు బయలుదేరారు.
ప్రతి కవి నోటా జాలువారిన కవిత్వం..
మహా కవియాత్ర కార్యక్రమంలో భాగంగా సంస్కృతి, సాహిత్యం, శాంతి, ప్రేమ వంటి అంశాలపై ప్రతి కవి నోటా కవిత్వం జాలువారింది. ఈ సందర్భంగా జ్ఞానజ్యోతిని సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ వెలిగించారు.
ఆరు పుస్తకాలు ఆవిష్కరణ..
ఈ సందర్భంగా పలువురు కవులు, రచయితలు రాసిన 6 పుస్తకాలను రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు. కారం శంకర్ రచించిన ఈ శతాబ్దపు మహోద్యమం కవియాత్ర, కవిత వెంకటేశ్వర్లు రచించిన కవితా తరంగాలు, మేరుగు అనురాధ రచించిన అనురాగ వీచికలు, తొగర్ల సురేశ్ రచించిన జావళి, దేవకన్య (బాలసాహిత్యం), ఎంఎస్ ఆచార్య రచించిన లఘుచిత్రం వంటి పుస్తకాలను ఆవిష్కరించారు.