హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ అక్రమ రవాణాను సమర్థంగా అడ్డుకోవడంలో తెలంగాణ దేశంలోనే నంబర్వన్ స్థానంలో ఉన్నదని సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డ్రగ్ పెడ్లర్స్పై పీడీ యాక్టు నమోదు చేస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా సోమవారం తన కార్యాలయంలో క్లౌడ్ ఫొటోగ్రాఫర్ యూనస్ ఫర్హాన్ రూపొందించిన ‘సే నో టు డ్రగ్స్’ పోస్టర్ను మహేశ్ భగవత్ ఆవిష్కరించి, మాట్లాడారు. తెలంగాణలో ఎన్డీపీఎస్ చట్టాన్ని సమర్థంగా అమలు చేస్తున్నారని, పదే పదే డ్రగ్స్, మానవ అక్రమ రవాణాకు పాల్పడే వారిని జైళ్లకు సైతం పంపిస్తున్నారని పేర్కొన్నారు. సైబరాబాద్ పరిధిలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులకు సంబంధించి అధికంగా కన్విక్షన్ రేటు ఉన్నదని, రాచకొండ కమిషనరేట్ పరిధిలో అధికంగా గంజాయి అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సింథటిక్ డ్రగ్స్ను పూర్తిగా అరికట్టే కార్యక్రమం చురుకుగా సాగుతున్నదని, ఇందులో భాగంగానే ప్రభుత్వం ప్రత్యేకంగా యాంటీ నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. డ్రగ్స్కు బానిసైన యువతను గుర్తించి, రీహాబిలిటేషన్కు పంపే ప్రయత్నం పోలీస్శాఖ చేస్తున్నదని తెలిపారు. వారిపై ఎలాంటి కేసులు లేకుండానే డ్రగ్స్ బారి నుంచి విముక్తి కల్పిస్తున్నారని స్పష్టంచేశారు.