సికింద్రాబాద్, జనవరి 10: మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, బీమా పథకాలు దేశానికి దిక్సూచి అయ్యాయని బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టయింది. సోమవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వారోత్సవాలు అంబరాన్నంటాయి. వంద మంది ఆడబిడ్డలు వేసిన రంగవల్లులతో మడ్ఫోర్ట్ దోభీఘాట్ మెరిసిపోయింది. సంక్షేమ పథకాలతోపాటు రైతుబంధు, బీమా, కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను సస్యశ్యామలం చేసిన సీఎం కేసీఆర్ చిత్రాన్ని కళ్లకు కట్టేలా ముగ్గులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలో సాగును పండుగలా చేశారన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శమన్నారు. ఎకరానికి రూ.5 వేలు చొప్పున ఏడాదిలో రెండు పంటలకు రూ.10 వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారన్నారు. పాసుబుక్ ఉన్న ప్రతి ఒక్కరికీ పెట్టుబడి సాయం అందుతుందన్నారు. నాలుగేండ్లలో రూ.50 వేల కోట్లు జమ చేశారన్నారు. రైతు బీమాతో 71వేల మందికి రూ.5 లక్షల చొప్పున బీమా అందిందని తెలిపారు. రాష్ట్రంలో 65 లక్షల మందికి పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. తెలంగాణ కంటే ఐదు రెట్లు పెద్దదైన ఉత్తరప్రదేశ్లో రైతులు ఆయిల్ ఇంజన్ మోటార్ల మీదనే ఆధారపడ్డారని, రాష్ట్రంలో రైతాంగానికి 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, లోక్నాథ్, నళిని కిరణ్, ప్రభాకర్, నాయకులు నివేదితా, ముప్పిడి గోపాల్, ముప్పిడి మధుకర్ పాల్గొన్నారు.
రైతుబంధు దేశానికే ఆదర్శం
వ్యవసాయాన్ని పండుగలా చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. కేసీఆర్ రైతుపక్షపాతి, పెట్టుబడి సాయం కింద ఇప్పటి వరకు రూ.50 వేల కోట్లు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అందజేస్తున్నారు. సంక్షేమ పథకాలు మెచ్చి యువత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదిలి సాగు బాట పడుతున్నారు. ఫలితంగా ఏడాదికి రెండు పంటలకు దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరింది.