సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని రాష్ట్ర స్పెషల్ సెక్రటరీ రజత్ కుమార్ అన్నారు. సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన వన్ వీక్ వన్ ల్యాబ్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అత్తాపూర్లోని సీసీఎంబీ లాకోన్స్ వేదికగా జరిగిన అక్వాటిక్ బయోడైవర్సిటీ అంశంపై ఆయన కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అతి తక్కువ సమయంలో చేపట్టిన కాళేశ్వరం దేశానికి గర్వకారణమన్నారు. దీంతోపాటు తెలంగాణలోని చెరువులు, కుంటలను పరిరక్షించేలా చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టుతో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయన్నారు. ప్రధానంగా చెరువుల పరిరక్షణ, భూగర్భ జలాల పెరుగుదల, పంటలకు సరిపడా నీళ్లతోపాటు ఊహించని స్థాయిలో మత్స్య సంపద పెరిగిందన్నారు. విద్యార్థుల్లో విజ్ఞాన జిజ్ఞాసను పెంచడంలో వన్ వీక్ వన్ ల్యాబ్ తరహా కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. అనంతరం సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందికూరి మాట్లాడుతూ అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణులు, మొక్కలను పరిరక్షించి జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో లాకోన్స్ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి వైల్డ్ లైఫ్ రీసెర్చ్ ల్యాబోరేటరీ హైదరాబాద్లోనే ఉందని, ఈ సెంటర్ ద్వారా ఎన్నో విజయాలను దేశానికి అందించామన్నారు. కార్యక్రమంలో కేరళ యూనివర్సిటీ ప్రొ. బీజు కుమార్, సెంట్రల్ ఫిషరీస్ శాఖ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డా. నర్సింహా మూర్తి, సీసీఎంబీ కార్తీకేయ వసుదేవన్, విద్యాధర్, తదితరులు పాల్గొన్నారు.