కొండాపూర్, మే 20 : నూతన ఆవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం వేదికగా నిలుస్తున్నదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థులు ‘క్రియేటివ్ హారిజన్’ పేరిట ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నూతన ఆవిష్కరణల దిశగా దూసుకుపోతుందన్నారు. అన్ని వర్గాల వారికి మెరుగైన విద్యనందించేందుకు గురుకుల విద్యాలయాలకు అన్ని విధాలుగా అభివృద్ధి చేశారన్నారు. గురుకుల విద్యాలయాల విద్యార్థులు ఏర్పాటు చేసిన చిత్రాలు, ఫొటోలను చూస్తుంటే అద్భుతంగా ఉన్నాయని, అనుభవజ్ఞులైన చిత్రకారులు, ఫొటోగ్రాఫర్లకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయని ప్రశంసించారు.
ఒకే రంగానికి పరిమితమవకుండా ఇష్టమైన రంగాల్లో రాణించాలన్నారు. ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని వాటిని చేరుకునే దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు. రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఆధ్యాత్మికతతో పాటు తెలంగాణ జీవన విధానాలు, సంప్రదాయాలను తెలియజేసేలా ప్రదర్శనలోని చిత్రాలున్నట్లు తెలిపారు. ప్రదర్శన 21వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీడీడీ రాహుల్ బొజ్జా, ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు, టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ రోనాల్డ్ రాస్, ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కే లక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.