సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): సహజమైన అటవీ నిర్మాణానికి భంగం కలగకుండా, ప్రజలు ప్రకృతి అనుభూతిని పొందేలా అర్బన్ ఫారెస్ట్ పార్కులను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్నది. రాష్ట్రంలో మొత్తం 109 ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేయగా, అందులో 21 అర్బన్ ఫారెస్ట్ పార్కులు హైదరాబాద్ చుట్టు పక్కలే ఉన్నాయి. ఈ పార్కులు నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించి ప్రకృతి ప్రేమికులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయని ఇండియన్ మాస్టర్మైండ్ వెబ్సైట్లో ప్రచురితమైన కథనాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
ఈ మేరకు అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్ డెవలప్మెంట్) అధికారి మోహన్ చంద్ర పరాజైన్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత పచ్చదనం పెంపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను చేపట్టిందని పేర్కొన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టగా.. ఈ కార్యక్రమం దేశంలోనే అతి పెద్దది కాగా, ప్రపంచంలో మూడోగా గుర్తింపు దక్కిందని గుర్తు చేశారు.
ఇందులో అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి కోసమే రూ.600 కోట్లను వెచ్చించిందని తెలిపారు. ఇక హైదరాబాద్ మహానగరం చుట్టూ ఏర్పాటు చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్కులతో 33.15 చదరపు కిలోమీటర్లు ఉన్న అటవీ ప్రాంతం 81.81 చదరపు కిలోమీటర్లకు పెరిగి మొత్తం 147 శాతం పెరుగుదల నమోదైందని, ఇదంతా నగరానికి 30 నుంచి 35 కి.మీ పరిధిలో ఉందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో రాబోయే రోజుల్లో మరింత పచ్చదనంతో నిండిన హైదరాబాద్కు అద్భుతమైన స్వాగతం అంటూ ట్వీట్ చేశారు.