ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
ఎగిరిన మువ్వన్నెల జెండా
మార్మోగిన తెలంగాణ గీతం
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు
మేడ్చల్ జోన్ బృందం : తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్, వివిధ పార్టీల కార్యాలయాలు, గ్రామ పంచాయతీల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ గీతం జనని జయకేతనం, తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ పాడిన పాటలు వాడ వాడలా మార్మోగాయి. మేడ్చల్ మున్సిపాలిటీ కార్యాలయం వద్ద జాతీయ జెండావిష్కరణలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. కీసర ప్రధాన చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి మంత్రి మల్లారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కీసరలోని అమరవీరుల స్థూపం వద్ద మంత్రి మల్లారెడ్డి , అదనపు కలెక్టర్లు నర్సింహా రెడ్డి, జాన్ శ్యాంసన్, ఆర్డీవో రవికుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతోమంది అమరులయ్యారని, వారిని ఈ రోజు గుర్తు చేసుకోవడం ధర్మమన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ సీఎం కేసీఆర్ సారథ్యంలో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమం తో ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించుకున్నామని తెలిపారు. 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతూ అద్భుత ప్రగతిని సాధిస్తున్నదని వివరించారు. సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఇది ముమ్మాటికీ సీఎం కేసీఆర్ దీక్షా దక్షతే కారణమని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన వేడుకల్లో జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
పీర్జాదిగూడ : తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరిస్తున్న కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్రెడ్డి, కార్పొరేటర్లు