సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టీ -డయాగ్నస్టిక్ సెంటర్స్ సేవలు రోగుల పాలిట వరంగా మారాయి. 2018, జనవరిలో ప్రారంభించిన ఈ సేవల వల్ల నిరుపేద రోగులకు ఖరీదైన వైద్య పరీక్షలు పూర్తి ఉచితంగా నిర్వహించడమే కాకుండా వ్యాధులను సకాలంలో గుర్తించగలుగుతున్నారు. దీని వల్ల రోగుల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా ఇటు ఆర్థిక భారాన్ని సైతం తగ్గించగలుగుతున్నారు. రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం ప్రభుత్వ దవాఖానల్లో చాలా తక్కువ సంఖ్యలో వైద్యపరీక్షలు జరిగేవి. ప్రభుత్వ దవాఖానకు వెళ్తే ఒక డాక్టర్ కన్సల్టేషన్ మినహా వైద్య పరీక్షలు బయటే చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది.
మందులు బయటే తీసుకొనేవారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశాఖ రూపురేఖలు మారిపోయాయి. వైద్యంతో పాటు వైద్య పరీక్షలు సైతం ప్రజలకు చేరువయ్యాయి. బస్తీ దవాఖానలతో వైద్యం ప్రజల నివాసాల మధ్యకే రాగా టీ-డయాగ్నస్టిక్ సెంటర్లతో వైద్య పరీక్షలు సైతం దగ్గరయ్యాయి. గ్రేటర్ వ్యాప్తంగా బస్తీ దవాఖానలు, పట్టణ ప్రాథమిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా, జిల్లా దవాఖానల్లో రోగుల నుంచి నమూనాలు సేకరించి టీ-డయాగ్నస్టిక్ సెంటర్కు పంపుతున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 434 కేంద్రాల నుంచి వివిధ రకాల నమూనాలను సేకరిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
రోజుకు 5వేల పరీక్షలు
గ్రేటర్ వ్యాప్తంగా 434 కేంద్రాల నుంచి వచ్చే నమూనాలను టీ-డయాగ్నస్టిక్ సెంటర్లలో పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బస్తీ దవాఖానలు, యూపీహెచ్సీ, పీహెచ్సీ, సీహెచ్సీ తదితర ఆరోగ్య కేంద్రాల నుంచి ప్రతి రోజు వివిధ రకాల పరీక్షలు దాదాపు 4వేల నుంచి 5వేల వరకు చేస్తున్నట్లు టీ-డయాగ్నస్టిక్ సెంటర్ అధికారులు తెలిపారు.
6లక్షల మందికి పైగా సేవలు
గ్రేటర్ వ్యాప్తంగా సంవత్సరానికి 6లక్షల మందికి పైగా రోగులు టీ-డయాగ్నస్టిక్ సేవలు పొందుతున్నట్లు అధికారిక రికార్డుల ద్వారా తెలుస్తోంది. నగరంలోని ఆరోగ్య కేంద్రాల్లోనే వివిధ పరీక్షలకు సంబంధించి రక్త నమూనాలు, టీబీ పరీక్షలకు సంబంధించి మల, మూత్ర తదితర 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
18.96 లక్షల మంది రోగులు.. 63.44 లక్షల పరీక్షలు..
టీ -డయాగ్నస్టిక్ సేవలు తొలుత నగరంలో 2018, జనవరిలో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సేవలు బస్తీ దవాఖానల్లో సైతం అందుబాటులో ఉండటంతో రోగుల పాలిట వరంగా మారాయి. అయితే కరోనా కారణంగా కొన్ని రోజులు తాత్కాలికంగా నిలిచాయి. తిరిగి కరోనా రెండో వేవ్ సమయంలో పునః ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సేవలు ప్రారంభమైన మూడున్నరేండ్లలో గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 18,96,025 మంది రోగులు టీ-డయాగ్నస్టిక్ సేవలు పొందారు. 63,44,265 వైద్య పరీక్షలు చేశారు.
వ్యాధులను సకాలంలో గుర్తించగలుగుతున్నాం..
టీ-డయాగ్నస్టిక్ సెంటర్ వల్ల వ్యాధులను సకాలంలో గుర్తించగలుగుతున్నాం. అంతే కాకుండా ప్రజారోగ్యం కూడా ఇతర ప్రాంతాలతో పోలిస్తే చాలా మెరుగుపడింది. ముఖ్యంగా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం సాధ్యమవుతోంది. గతంలో అయితే బీపీ, షుగర్ లాంటివి కూడా ఆర్గాన్స్ దెబ్బతినే వరకు బయట పడేవి కాదు. ప్రస్తుతం బీపీ, షుగర్ నుంచి క్యాన్సర్ వరకు ప్రారంభ దశలోనే గుర్తిస్తున్నాం. దీని వల్ల రోగికి సకాలంలో చికిత్స అందిస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడటంలో సఫలీకృతమవుతున్నాం. – డాక్టర్ జె.వెంకటి, హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి