ఉప్పల్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): మహిళలు ఇంటికి పరిమితం కాకుండా, తమకున్న నైపుణ్యాలకు మెరుగు పెడుతూ సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని డీజీపీ జితేందర్ సూచించారు. మహిళ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా మహిళల కోసం ప్రత్యేకంగా మేగా జాబ్మేళాను ఆదివారం నాల్లోని ఎస్వీఎం గ్రాండ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ జితేందర్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సమాజంలో సగభాగం ఉన్న మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి విధి అని, గృహిణిగా, తల్లిగా, ఉపాధ్యాయురాలిగా, స్నేహితురాలిగా, కూతురిగా, సోదరిగా ఇలా విభిన్న పాత్రలు సోషిస్తూ పురుషుడి విజయంలోనూ, అతని సుఖ సంతోషాలలోను ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. అయితే స్త్రీలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా ఉన్నత చదువులు చదివి, వారిలో విభిన్న నైఫుణ్యాలను మేధస్సును ఉపయోగించుకొని వారి అర్హతలకు తగిన ఉద్యోగ అవకాశాలు దక్కించుకొని ముందుకు వెళ్లాలని సూచించారు.
కార్యక్రమానికి గౌరవ అతిధిగా హాజరైన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు మాట్లాడుతూ మహిళలను గౌరవించడం అంటే మనలని మనం గౌరవించుకోవడమే అన్నారు. మహిళలు తమ నైపుణ్యాలను, మేధస్సును ఉపయోగించుకొని తమ స్వశక్తితో జీవించడం ద్వార వారి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం మరింతగా పెరుగుతాయని, అందుకు దోహదపడేలా ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేశామన్నారు.
ఈ జాబ్ మేళాలో సుమారు 2800 మంది మహిళలు ఉద్యోగ అవకాశాల కోసం తమ పేర్లను రిజిస్టేష్రన్ చేసుకోగా వారి అర్హతలు, నైపుణ్యాలను బట్టి 2323 మంది ఉద్యోగాలు పొందారని తెలిపారు. ఈ జాబ్మేళకు గొప్ప మనస్సుతో ముందుకొచ్చి విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషించిన సైబర్సెక్యూరిటీ కౌన్సిల్లోని సభ్య కంపెనీలను సీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనరేట్ డీసీపీలు పద్మజ, ఆక్షాంశ్యాదవ్, ప్రవీణ్కుమార్, అరవింద్బాబు, శ్రీనివాసులు, ఉషా విశ్వనాథ్, మనోహర్, నరసింహారెడ్డి, రమణారెడ్డి, శ్యామ్ సుందర్, నాగలక్ష్మిలతో పాటు సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.