సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఏపీ నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు లారీలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీఎస్ నాబ్) అరెస్టు చేసింది. బషీర్బాగ్లోని సీసీఎస్ భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సునీతారెడ్డి వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన హసన్, స్థానికంగా ఉండే రాజ్ అంబదాస్ షిండేతో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, పార్వతీపురం నుంచి మహారాష్ట్రకు గంజాయి తీసుకురావాలని, ఇందుకు రూ. 2 లక్షల కమీషన్ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు.
ఇందులో భాగంగానే తన బంధువులైన బాలాజీ అర్జున్ కాలే, నిఖిల్ నందకుమార్ గ్వాలీ, మధుకర్ అర్జున్ కాలే, సంజయ్ రవీంద్ర చౌహాన్తో కలిసి ఒక ముఠాను తయారు చేశాడు. రాజు అంబదాస్ గంజాయి స్మగ్లింగ్ చేసేందుకు కియా కార్ను సమకూర్చుకున్నారు. మహారాష్ట్రలో కాంట్రాక్టు అప్పగించిన హసన్ సూచన మేరకు ఏపీ, పార్వతాపూర్లో ఒక్కోటి రెండు కిలోల బరువున్న 104 ప్యాకెట్ల గంజాయిని తీసుకున్నారు. లారీ క్యాబిన్లో రహస్యంగా గంజాయి స్మగ్లింగ్ కోసం తయారు చేసిన అరలో దానిని దాచి, అక్కడి నుంచి బయలు దేరారు. కియా కారులో రాజు అంబదాస్, బాలాజీ అర్జున్ కాలే, నిఖిల్ నందకుమార్ 20 కిలోమీటర్ల ముందుకు వెళ్తుండగా.. లారీ డ్రైవర్ మధుకర్, క్లీనర్ సంజయ్ రవీంద్ర లారీలో వెనుక నుంచి వెళ్తుంటారు.
కారులో ముందు వెళ్తున్న వారు పోలీసు తనిఖీలను గుర్తించి.. వెనుక నుంచి లారీలో వస్తున్న వారిని వాట్సాప్ ద్వారా అప్రమత్తం చేస్తారు. విశ్వసనీయ సమాచారంతో టీఎస్-నాబ్ ఏసీపీ నర్సింగ్రావు నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు పి.రాజేశ్, డీఎస్ డానియల్, విజయభాస్కర్ రెడ్డి రెండు బృందాలుగా ఏర్పడి, నిఘా పెట్టారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రాంతంలోని నక్కలబండ తండా వద్ద పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ కోటి రూపాయలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు హసన్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామన్నారు. టీఎస్-నాబ్ తరపున ప్రతి జిల్లాకు ఓ డీఎస్పీ పనిచేస్తున్నారని, డ్రగ్స్ వ్యవహారాలకు సంబంధించి 8712671111 ఫోన్ నంబర్కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు.