సిటీబ్యూరో, నవంబర్ 3(నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలలో కీలక ఘట్టం మొదలైంది. ఎన్నికల బరిలో పోటీని ఖరారు చేసే నామినేషన్ల పర్వానికి అభ్యర్థులు తెరలేపారు. తొలి రోజున అంతంత మాత్రంగానే అభ్యర్థులు నామినేషన్లను సమర్పించారు. ఈ క్రమంలో మహానగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఆర్వో సెంటర్కు వంద మీటర్ల దూరంలో 144 సెక్షన్ విధించి ఏర్పాట్లు చేశారు.
తొలి రోజున ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు మినహా స్వతంత్ర, రెబల్ అభ్యర్థులే నామినేషన్లు దాఖలు చేశారు. ఇక మలక్ పేట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన బీఎస్పీ అభ్యర్థి రమేష్ ప్రచార ఆర్భాటంతో బయలుదేరగా, సమయానికి సెంటర్కు చేరుకోలేకపోవడంతో వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. బరిలో ఉన్న మరో అభ్యర్థి మహ్మద్ అక్రం ఆలీఖాన్ నామినేషన్లు సమర్పించారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైన తొలి రోజు కావడంతో ఆశించిన మేర హడావుడి కనిపించలేదు. శుక్రవారం నామినేషన్ వారిలో ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులే ఉండగా, కొన్ని నియోజకవర్గాలలో ఒక్క నామినేషన్ కూడా రాలేదు. సికింద్రాబాద్ నుంచి శివసేన అభ్యర్థి సుదర్శన్ నామినేషన్ వేయగా, సికింద్రాబాద్ నుంచి అడ్డగుట్టకు చెందిన స్వతంత్ర అభ్యర్థి రాహుల్ గుప్తా నామినేషన్ సమర్పించారు.
మేడ్చల్, నవంబర్3(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మొదటి రోజైన శుక్రవారం ఆరు నామినేషన్లు దాఖాలైనట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి 2, ఉప్పల్ నియోజవర్గం నుంచి 2, మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి 1, కూకట్పల్లి నియెజకవర్గం నుంచి 1 నామినేషన్లు దాఖాలు అయినట్లు పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఒక్క నామినేషన్ దాఖలు కాలేదని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. మొదటి రోజు నామినేషన్ల పక్రియ ప్రశాంతంగా ముగిసిందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ స్పష్టం చేశారు.
నియోజకవర్గం నామినేషన్ దాఖలు
మేడ్చల్ శ్రీధర్రెడ్డి (ఇండిపెండెంట్)
మేడ్చల్ ప్రవీణ్ కుమార్ రెడ్డి (ఇండిపెండెంట్)
మల్కాజిగిరి జాజుల భాస్కర్ (శ్రమజీవి పార్టీ)
కుత్బుల్లాపూర్ చంద్రశేఖర్ చలిక (ఇండిపెండెట్)
ఉప్పల్ వేరుచిన్న ధన్రాజ్(ఇండిపెండెట్)
ఉప్పల్ ఎం.మల్లేశం (తెలంగాణ ప్రజాజీవన రైతుపార్టీ)