సిటీబ్యూరో: ప్రజల అభిప్రాయం తీసుకోకుండా, వారితో కనీసం చర్చించకుండా ఇండ్లను ఎలా కూలుస్తారని తెలంగాణ బస్తీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళా దినోత్సవ సభలో మూసీ పరీవాహక ప్రాంతాల ఇండ్లను కూల్చడంపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
ముఖ్యమంత్రికి మూసీ పరీవాహక ప్రజల మీద ప్రేమ ఉంటే.. ముందుగా వారిని అధికారికంగా కలిసి వారి అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. ఇండ్లు కూల్చి.. ప్రభుత్వానికి ఇష్టమున్న దగ్గర కాకుండా జీవనోపాధి అవకాశాలతో పాటు అన్ని మౌలిక వసతులు ఉండేప్రాంతంలో నూతన ఇండ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు.మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ కట్టిన బిల్డర్ అక్రమంగా అనుమతులు తీసుకున్నారని సీఎం అంటున్నారని.. అప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా? అని ప్రశ్నించారు. పైసాపైసా కూడబెట్టుకుని అన్ని అనుమతులు తీసుకుని కట్టుకున్న ఇండ్లను ఇష్టానుసారం ఎలా కూలుస్తారని నిలదీశారు. మూసీ వెంబడి ఉన్న అపార్ట్మెంట్లు అయినా.. బస్తీల్లో ఉన్న పేదల ఇండ్లయినా కూల్చడానికి ముందే.. వారికి నూతనంగా ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.