నాంపల్లి కోర్టులు, నవంబర్ 4(నమస్తే తెలంగాణ): వకీళ్లందరికీ ఆరోగ్యకార్డులు అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. శనివారం చలో జలవిహార్ పేరిట న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళన సభకు హాజరైన సందర్భంగా తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు జి.జితేందర్రెడ్డి మంత్రిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఎన్నికల అనంతరం, రక్షణ చట్టం రూపొందిస్తామని ప్రకటించారు.
తెలంగాణ బార్ కౌన్సిల్లో 45 వేల మంది న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నారని, వారందరికీ ఆరోగ్య కార్డులు అందించాలని మంత్రికి అందించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. గతంలో న్యాయవాదులపై దాడులు, హత్యలు జరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ న్యాయవాదుల రక్షణ చట్టం అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విన్నవించారు. మూడేండ్ల లోపు ప్రాక్టీసు చేస్తున్న జూనియర్లకు ఉపకార వేతనం ఇవ్వాలని కోరారు. న్యాయవాదుల సంక్షేమ నిధికి మరింత బడ్జెట్ను కేటాయించాలని విన్నవించారు. నెక్లెస్ రోడ్డులోని జల విహార్లో ఏర్పాటైన సమావేశానికి అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొని బీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు.