ఉత్సాహంగా బతుకమ్మ ఆడిన ఎమ్మెల్సీ కవిత, ఇతర మహిళా ప్రజాప్రతినిధులు
హైదరాబాద్, అక్టోబర్ 7 ( నమస్తే తెలంగాణ ) : అసెంబ్లీ ఆవరణలో మహిళా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు ఉత్సాహంగా బతుకమ్మ పండుగను నిర్వహించారు. గురువారం సాయంత్రం అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రొటెం చైర్మన్ వి.భూపాల్రెడ్డి, శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పీవీ వాణీదేవి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, సీతక్క, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి.నర్సింహాచార్యులు, ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
నగరంలో బతుకమ్మ సంబురాల సందడి మొదలైంది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు ఆట, పాటలతో వేడుకలు నిర్వహించారు. తొలుత ఇంటిలోనే కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ ఆడిన మహిళలు.. ఆ తర్వాత చుట్టుపక్కల వారితో కలిసి ఇంటి ముందర ఆడారు. అక్కడి నుంచి సమీపంలోని మైదానంలో ఏర్పాటు చేసిన ఉత్సవ వేదికల వద్దకు వెళ్లి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. చిన్న పిల్లలు మొదలు వృద్ధులు వరకు కొత్త వస్ర్తాలు ధరించి.. సంతోషంగా బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. కోర్టులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పలు సంస్థల్లో కూడా బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ప్రముఖుల కుటుంబాల మహిళలు సైతం పాల్గొని ఉత్సాహాన్ని ఇచ్చారు.
తెలంగాణలో బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. బుధవారం ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన వేడుకలు.. తొమ్మిది రోజుల పాటు అంగరంగవైభవంగా కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాల్లో రెండో రోజైన ఆశ్వయిజ శుద్ధ పాడ్యమి తిథితో దుర్గా శరన్నవరాత్రోత్సవాలకు అంకురార్పణ పడింది. బతుకమ్మ వేడుకలు రెండో రోజుకు చేరుకున్నాయి. తొమ్మిది రోజుల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ‘అటుకుల బతుకమ్మ’గా ఈ వేడుకను పిలుచుకుంటారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చుకుని ఇంట్లో గౌరమ్మను పెట్టుకుని పూజించుకునే మహిళలు.. అటుకులు బెల్లం, సప్పిడి పప్పును అమ్మవారికి నైవేథ్యంగా సమర్పిస్తారు. అందరి తల్లిగా గౌరమ్మ నిలిచి.. తన చల్లని దీవెనలు అందిస్తుందని భక్తుల విశ్వాసం. రెండో రోజు బతుకమ్మ వేడుకలను పూర్తి చేసుకుని గౌరమ్మకు నైవేథ్యంగా సమర్పించే అటుకులు బెల్లం, సప్పిడి పప్పును అందరు పంచుకున్నారు. పాడి పంటలు, భోగభాగ్యాలతో పచ్చని ప్రకృతితో తమను కాపాడమ్మా.. అంటూ మహిళలు బతుకమ్మ పాటలతో ఆడి, పాడి రెండో రోజు వేడుకలను ఉత్సాహంగా నిర్వహించుకున్నారు.