సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : సాంకేతిక సమస్యల నడుమ అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ నడుస్తోంది. ఒక్క దరఖాస్తుకు గంట సమయం తీసుకుంటున్నది. దరఖాస్తులో ఉన్న వివరాలన్నింటినీ ఆప్లోడ్ చేసే క్రమంలో చివర సబ్మిట్ బటన్ నొక్కాగానే సర్వర్ డౌన్ అంటూ సమస్య తలెత్తుతుందని డేటా ఎంట్రీ ఆపరేటర్లు చెబుతున్నారు. పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తుల ఆప్లోడ్లో అందుకు తగ్గట్లుగా సాంకేతిక సమస్య తలెత్తకుండా పక్కాగా చర్యలు చేపట్టాల్సిన అధికారులు ఏ మాత్రం పట్టించుకోని కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని పేర్కొంటున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో దాదాపు 3500 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకున్నారు. మొత్తం స్వీకరించిన 24,74,325 దరఖాస్తులలో రేషన్ కార్డు, ఇతర దరఖాస్తులు 5,73,069లు మినహా అభయహస్తం కింద స్వీకరించిన దరఖాస్తులు 19,01,256లు మాత్రమే ప్రాధాన్యత క్రమంలో అప్లోడ్ చేస్తున్నారు. ఈ నెల 17 వరకు అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీని పూర్తి చేయాలని, ఇందుకు సీనియర్ ఐఏఎస్లకు పర్యవేక్షణాధికార బాధ్యతలు అప్పగించారు.
కానీ రెండు రోజులుగా ఒక్కో దరఖాస్తుకు గంట సమయం తీసుకోవడం, రోజువారీ లక్ష్యంలో సగం కూడా ఎంట్రీ కాకపోవడంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వివరాల ఆధారంగా అర్హులకు సకాలంలో అభయహస్తం పథకం ఫలాలు అందుతాయన్న లబ్ధిదారుల ఆశలపై అధికారుల నీళ్లు చల్లుతున్నారు. వెంటనే తరచూ తలెత్తే సాంకేతిక సమస్యలను అధిగమించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నో అనుమానాలు..
కాగా పండగ సెలవులు..భారీ దరఖాస్తులు వెరసి గడువులోగా దరఖాస్తుల ఎంట్రీ పూర్తవుతుందో! లేదో? అన్న అనుమానాలు వస్తున్నాయి. అదీగాక అర్హుల ఎంపికకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు మార్గదర్శకాలు రాలేదు. మార్గదర్శకాలు వచ్చాక మరో దఫా సర్వే చేసి అర్హుల పేర్లను పోర్టల్లో ఉంచుతారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఎంట్రీలో తప్పులు దొర్లితే సవరణలకు అవకాశం ఉంటుందా? లేదా! అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.