హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో వైద్య సేవలు అందించేందుకు టెక్నికల్ కమిటీని నియమించాలని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodara Rajanarasimha) సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. గురువారం తెలంగాణ సచివాలయంలోని తన కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
వరంగల్, హైదరాబాద్ లోని అల్వాల్, ఎల్బీనగర్, సనత్ నగర్లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ల నిర్మాణ పనుల పురోగతి తో పాటు ఎర్రమంజిల్ లోని నిమ్స్(NIMS) హాస్పిటల్లో 2వేల బెడ్స్ సామర్ధ్యం తో నిర్మిస్తున్న విస్తరణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకు రావాలని సూచించారు.
వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ నగరానికి మెరుగైన వైద్య సేవల(Better medical Services) కోసం వచ్చే రోగులకు అంధించే చికిత్సలపై టెక్నికల్ కమిటీని నియమించాలని ఆదేశించారు. టెక్నికల్ కమిటీ సూచించిన విధంగా ఆయా ఆస్పత్రులలో స్పెషాలిటీ సేవలను, చికిత్సలు అందించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర వైద్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా చోoగ్తు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు ఆర్ అండ్ బీ, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు .