Talasani Srinivas Yadav | హైదరాబాద్ : ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా అన్ని సౌకర్యాలు, వసతులతో ఈఎస్ఐ గ్రేవ్ యార్డ్ను అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన చాంబర్లో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని జీహెచ్ఎంసీ, ఇంజినీరింగ్, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ, హార్టికల్చర్ తదితర శాఖల అధికారులతో నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న, ఇంకా చేపట్టవలసిన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని అమీర్పేట డివిజన్లో గల ఈఎస్ఐ గ్రేవ్ యార్డ్ అభివృద్ధి కోసం రూపొందించిన నమూనాలను ఖైరతాబాద్ జోన్ జోనల్ కమిషనర్ రవి కిరణ్ మంత్రికి ఫోటో ప్రదర్శన ద్వారా వివరించారు. సుమారు ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈఎస్ఐ గ్రేవ్ యార్డ్ను రూ. 4.5 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసి ఏడాది లోగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని మంత్రి వివరించారు. అన్ని సౌకర్యాలు, వసతులతో రాష్ట్రంలోనే నెంబర్ 1 మోడల్ గ్రేవ్ యార్డ్ (వైకుంఠ ధామం) గా నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు.
నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అధికారులు వారంలో 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు మరింత వేగవంతంగా జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. కొన్ని పనులు ఇంకా ప్రారంభించలేదని, త్వరితగతిన ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. శంకుస్థాపన జరిగిన వారం రోజుల లోపే పనులు ప్రారంభించే విధంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
పేద, మధ్య తరగతి ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాలలో రోడ్లు, డ్రైనేజీ, వాటర్ వంటి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో వ్యవహరించి పనుల మంజూరు, అనుమతుల ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. సనత్ నగర్లోని నెహ్రూ నగర్ పార్కును ఎంతో అద్బుతంగా నిర్మించారని, స్థానిక ప్రజలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అధికారులను మంత్రి అభినందించారు.
వర్షాకాలం ప్రారంభానికి ముందే పార్కుల అభివృద్ధి, వివిధ కాలనీలు, బస్తీలలో మొక్కలు నాటేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని చెప్పారు. సనత్ నగర్లో అత్యధికంగా 55 పార్కులు ఉన్నాయని, వాటి అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఇంకా చేపట్టవలసిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను అందజేస్తే మంజూరుకు చర్యలు తీసుకుంటానని మంత్రి అధికారులకు చెప్పారు.
జూన్ 20వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం నిర్వహించనున్నందున ఇప్పటి నుండే అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి చేపట్టి సకాలంలో పూర్తయ్యే విధంగా ప్రణాలికలను సిద్దం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేచర్ క్యూర్ హాస్పిటల్ లైన్ రోడ్డు, 60 ఫీట్ రోడ్డు తదితర పనులను త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అన్ని ప్రాంతాలలో స్ట్రీట్ లైట్లు వెలిగేలా చూడాలని స్ట్రీట్ లైట్ అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు రవి కిరణ్, శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుంద రెడ్డి, ఈఈలు సుదర్శన్, ఇందిర, శానిటేషన్ డీఈ శ్రీనివాస్, హార్టికల్చర్ డీడీ శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ ఏసీపీలు రమేష్, క్రిస్టోఫర్, స్ట్రీట్ లైట్ ఈఈ సంతోష్, డీఈఈలు కిరణ్మయి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.