ఎల్బీనగర్, జనవరి 31 : సరూర్నగర్ స్టేడియంలో ఫిబ్రవరి 11న జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మార్డీసీ చైర్మన్ , ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. మంగళవారం స్టేడియంలో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… స్టేడియం వెనుక ఉన్న స్థలంలో జాబ్ మేళాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేళాలో దాదాపు 108 కంపెనీలు ( టెక్నికల్, నాన్ టెక్నికల్, ఐ.టీ, నాన్ ఐ.టీ) కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు.
ఏడో తరగతి నుంచి పీజీ వరకు పాస్ అయిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ కూడా తమ పేరును జాబ్ మేళాలో నమోదు చేసుకోవాలని కోరారు. ఈ నెల 11న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు, సెట్విన్ ఎండీ వేణుగోపాల్ రావు, మన్మోహన్, రాజిరెడ్డి, రమాకాంత్, రామ్కల్యాణ్, చంద్రశేఖర్ రెడ్డి, తిలక్, సుమంత్ పాల్గొన్నారు.