సమయం అధికంగా ఉంటే వాహనాల ఇంజిన్లు ఆఫ్
అవగాహన కల్పించనున్న ట్రాఫిక్ పోలీసులు
రెండు నెలల్లో 100 కాలుష్య రహిత కూడళ్లు
ఆగస్టు 1 నుంచి ఆధునిక సిగ్నల్ వ్యవస్థ
నగరంలో వాయు కాలుష్యం తగ్గింపునకు చర్యలు
n టెక్నికల్ బృందాలతో అధికారుల సమీక్ష
ప్రతి సిగ్నల్ వద్ద విధిగా టైమర్ బిగింపు
మహానగరంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు ప్రారంభించారు. ప్రధాన కూడళ్ల వద్ద ఇప్పటికే టైమర్లు ఉండగా, లేనిచోట్ల టైమర్లు బిగించనున్నారు. టైమర్ సూచించిన సమయం అధికంగా ఉంటే వాహనాల ఇంజిన్లు ఆపేసేలా ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించనున్నారు. ‘ఇంజిన్లు ఆపేయండి- కాలుష్యం తగ్గిద్దాం’ అని సూచించనున్నారు. ఇందులో భాగంగా మొదటి దఫాలో 100 కూడళ్లలో తప్పకుండా టైమర్లు పనిచేసేలా చర్యలు తీసుకొని, వాహనాల ఇంజిన్లు ఆఫ్ చేయించనున్నారు. ఇంజిన్లు ఆన్లో ఉన్నప్పుడు విడుదలయ్యే పొగ, ఆపేసినపుడు తగ్గిన పొగను లెక్కిస్తారు. ఇలా అన్ని కూడళ్ల వద్ద చర్యలు చేపడితే వాయు కాలుష్యాన్ని సాధ్యమైనంత మేర తగ్గించొచ్చనేది ట్రాఫిక్ పోలీసుల లక్ష్యం. అంతేకాకుండా సిగ్నళ్ల వద్ద వాహనాల రద్దీని బట్టి గ్రీన్ లేదా రెడ్సిగ్నల్ ఇచ్చేలా అత్యాధునిక కెమెరాలను బిగిస్తున్నారు. ఇప్పటికే 70 కెమెరాల బిగింపు పూర్తి కాగా, జూలై చివరి నాటికల్లా 250 కెమెరాలు బిగించి ఆగస్టు 1 నుంచి ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తేనునున్నారు. ప్రస్తుతం గ్రేటర్వ్యాప్తంగా అన్నిరకాల వాహనాలు కలిపి సుమారు 70 లక్షలు ఉన్నాయి.
సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ) : నగరంలోని పలు కూడళ్ల వద్ద వాహనాల ద్వారా వచ్చే వాయు కాలుష్యాన్ని తగ్గించి, గ్రీన్ జంక్షన్లుగా మార్చేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. మొదటి దఫాలో 100 కూడళ్లను ఎంపిక చేసి, అక్కడ టైమర్లు తప్పని సరిగ్గా పనిచేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు. టైమర్ల ఆధారంగా వాహనదారులు తమ వాహనాల ఇంజన్ను ఆపేస్తారు. ఇంజన్ ఆపడంతో ఆ కూడలిలో విడుదలయ్యే పొగ పూర్తిగా తగ్గిపోతుంది. వాహనం ఇంజన్ ఆపకుండా, ఆన్లో ఉంచి నిమిషం పాటు కూడలిలో ఆగడంతో ఎంత మేర పొగ విడుదలవుతుందనే విషయాన్ని ఆయా వాహనాల ఆధారంగా లెక్కిస్తారు. ఒక నిమిషం పాటు ఇంజన్ను ఆపేయడం వల్ల ఆ కూడలిలో ఎంత మేర వాయు కాలుష్యం తగ్గిందనే అంశాన్ని పరిశీలిస్తారు.
వాయు కాలుష్యం తగ్గించేందుకే..!
గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 70 లక్షల వాహనాలున్నాయి. ఇందులో 40 లక్షల నుంచి 50 లక్షల వాహనాలు తిరుగుతుంటాయి. ప్రధాన కూడళ్ల నుంచి రోజు 4 లక్షల నుంచి 5 లక్షల వాహనాలు సుమారుగా రాకపోకలు సాగిస్తుంటాయి. నగరంలో తిరిగే ఈ వాహనాల నుంచి వెలువడే పొగతో విపరీతమైన కాలుష్యం వాయువులో కలుస్తుంది. అది నగర ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు నడుంబిగించారు. ఇప్పటికే ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఉన్న ప్రధాన కూడళ్లలో అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 70 వరకు పూర్తవ్వగా మరో 250వరకు కూడళ్లలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహిస్తూ జూలై చివరి నాటికి పనులు పూర్తి చేయడంతో ఆగస్టు 1 నాటికి అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో పాటే కాలుష్య రహిత కూడళ్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
వాహనదారులకు అవగాహన
కూడళ్ల వద్ద వాహనాల ఇంజన్ను ఆపి, పెట్రోల్, డీజిల్ సేవ్ చేయండి అంటూ గతంలో కొన్ని ప్రకటనలు కూడా వచ్చేవి. పెట్రోల్, డీజిల్ సేవ్ కావడంతో పాటు కూడళ్లలో వాయు కాలుష్యం తగ్గుతుంది. దీనికి వాహనదారుల సహకారం ఎంతో కావాలి. అందుకు వారిలో అవగాహన కల్పించి, కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తూ అందరిలో మార్పు తీసుకొచ్చేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కూడళ్లలో ఉండే ట్రాఫిక్ సిగ్నల్స్ టైమర్ తప్పని సరిగా ఉండాలి, ఎంత సేపు వాహనాన్ని ఆపుతున్నామనే విషయం ప్రతి వాహనదారుడికి తెలియాలి. అందుకు అధికారులు టెక్నికల్ బృందాలతో సమిక్ష నిర్వహిస్తున్నారు.