బంజారాహిల్స్ : ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు.. కొంతకాలం తర్వాత ఉద్యోగం విషయంలో భార్య చిన్నచూపు చూస్తుందని మనస్తాపానికి గురయ్యాడు… ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎస్పీఆర్ హిల్స్లోని వినాయక్నగర్ బస్తీకి చెందిన కె.సాయికిరణ్(24) స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం అదే బస్తీకి చెందిన బీటెక్ విద్యార్థినిని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత దంపతుల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సాయికిరణ్ చేస్తున్న ఉద్యోగాన్ని చులకన చేస్తూ మాట్లాడింది.. చెప్పిన మాట కూడా వినడంలేదు. దీంతో వారిద్దరి మధ్య ఇంకా గొడవలు పెగిగాయి. ఈ క్రమంలో 8 నెలల క్రితం అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఎన్నిసార్లు పిలిచినా రాకపోవడంతోపాటు వ్యంగ్యంగా మాట్లాడటంతో మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని కిందకు దించి ఉస్మానియా దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి సోదరుడు సాయికుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.