వెంగళరావునగర్, జూలై 27: కరోనా మహమ్మారి దెబ్బతో పలు కుటుం బాల పరిస్థితి అగమ్యగోచరంగాతయారైంది. దీంతో ఊరు విడిచి, రాష్ట్రం దాటి నగరానికి బిడ్డలతో సహా వచ్చిన తల్లిదండ్రులు పిల్లలలో భిక్షాటన చేయిస్తున్నా రు. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా నుంచి వచ్చిన నిరుపేద కుటుంబాల పిల్లలు పొట్టకూటి కోసం నగరంలోని ప్యాట్నీ,ప్యారడైజ్ సర్కిళ్ల వద్ద బిచ్చమెత్తుకుండటాన్ని అటుగా వెళ్తున్న జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి గమనించారు.
భిక్షాటన నుంచి వారిని విముక్తి చేసి..వారికి మంచి జీవితం అందించాలని ఆమె అధికార యం త్రాంగానికి సూచించారు. కలెక్టర్ సూచన మేరకు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆకేశ్వర్రావు, బాల రక్షా భవన్ హైదరాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ ఎం.సుమలత, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో ఓ బృందంగా ఏర్పడి.. ఈ ఆపరేషన్ను నిర్వహించారు.
ఆరేండ్లలోపు ఉన్న 14 మంది బాలలను భిక్షాటన నుంచి అధికారులు విముక్తి చేసి వారిని నెలన్నర క్రితం వెంగళరావునగర్ డివిజన్లోని మధురానగర్లోని స్టేట్ హోం శిశువిహార్, బాల సదన్లకు పిల్లలను తీసుకొచ్చారు. అనంతరం, పిల్లలకు, వారి తల్లిదండ్రులకు డీఎన్ఏ టెస్టులు నిర్వహించారు. ఈ పిల్లలందరూ గుల్బర్గాకు చెందిన వారి పిల్లలేనని డీఎన్ఏ పరీక్షల్లో తేలింది. దాంతో పిల్లల తల్లిదండ్రులకు అధికారులు కౌన్సెలింగ్ చేశారు. పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకుల్ని చేయాలని.. ఇలా పిల్లల్ని ముష్టివాళ్లుగా మార్చడం తగదని వారికి హితబోధ చేశారు. అనంతరం అధికారులు పిల్లలను వారి తల్లిదండ్రుల సమక్షంలో శిశు విహార్ నుంచి గుల్బర్గాకు బస్సులో పంపారు.