నగర పౌరులారా స్పందించండి. ఉత్తమ నగరాల్లో హైదరాబాద్ను మొదటి స్థానంలో నిలుపండి. అందుకు నేడు ఒక్కరోజే గడువు ఉన్నది. స్వచ్ఛతలో హైదరాబాద్ను అగ్రస్థానంలో నిలిపేందుకు నడుం బిగించండి. ప్రతి ఒక్కరూ ఓటు వేయండి. మహానగరం సత్తా చాటండి. స్వచ్ఛ సర్వేక్షణ్-2020 ర్యాంకింగ్లో మొదటి స్థానంలో నిలిచాం. ఈ సారికూడా ఆ స్థానాన్ని పదిలం చేసుకుందాం.
హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలిపే ప్రక్రియలో జీహెచ్ఎంసీ చేపట్టిన చర్యలు సత్ఫలితాల దిశగా అడుగులు పడుతున్నాయి. స్వచ్ఛత మీద, స్వచ్ఛ సర్వేక్షన్ సర్వేపై ప్రజల్లో అవగాహన కల్పించి వారి అభిప్రాయాలు సేకరించడంలో జీహెచ్ఎంసీ ప్రతిభ కనబర్చింది. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో (ఎస్ఎస్-2021) భాగంగా మంగళవారం సాయంత్రం నాటికి సిటిజన్ ఫీడ్ బ్యాక్లో ప్రధాన నగరాల కంటే ఎక్కువ ఓట్లు రాబట్టి రెండవ స్థానంలో నిలిచింది. 40లక్షలు పైబడి జనాభా ఉన్న నగరాల్లో పోటీ పడి పౌర స్పందన విభాగంలో అహ్మదాబాద్ 9,02,750 ఓట్లతో మొదటి స్థానంలో నిలువగా, గ్రేటర్ హైదరాబాద్ 8,22,450 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది.
ముంబాయి, సూరత్, పుణే వంటి నగరాలను వెనక్కి నెట్టి హైదరాబాద్ సత్తా చాటింది. బుధవారం చివరి రోజు కావడంతో పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నది. మరో లక్ష ఓట్లు సాధించి గతేడాది మాదిరిగానే హైదరాబాద్ నగరాన్ని ఉత్తమ నగరంగా మొదటి స్థానంలో నిలుపడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు పేర్కొన్నారు
ఎస్ఎస్ సర్వే మొత్తం 6వేల మార్కులకు జరుగుతుంది. అందులో 30శాతం (1800) మార్కులు జనాభిప్రాయానికి ఉంటాయి. మొత్తం 6వేల మార్కులకు గాను సర్వీస్ లెవల్ ప్రొగ్రెస్కు 2400మార్కులు, సర్టిఫికేషన్కు 1800 మార్కులు కేటాయించారు. ఈ సర్వే ద్వారా వచ్చిన మార్కులను దేశంలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మెట్రో సిటీలకు వచ్చిన మార్కులతో పోల్చి అధికంగా వచ్చిన మార్కుల ప్రాతిపదికన స్వచ్ఛ సర్వేక్షణ్-2021 ర్యాంకింగ్లను ప్రకటిస్తారు. పౌర స్పందన ప్రతికూలం లేదా అనుకూలం అనే అంశానికన్నా ఎక్కువ మంది అభిప్రాయం చెప్పాలనేది ఈ విభాగం ఉద్దేశం. ఈ విభాగానికి కేంద్ర సర్కారు ప్రత్యేకంగా ర్యాంకు ప్రకటిస్తుంది. గతేడాది ఇందులో హైదరాబాద్కు 1వ స్థానం దక్కింది. అన్ని అంశాలను కలిపి ప్రకటించిన ర్యాంకుల్లో 23వ స్థానం లభించింది.
స్వచ్ఛ సర్వేక్షణ్-2021లో నగరాల స్వచ్ఛత, పారిశుధ్యం, పరిశుభ్రతపై ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే ర్యాంకింగ్లు ప్రకటించడానికి కేంద్రం స్వచ్ఛ భారత్ మిషన్ ప్రాధాన్యత ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2021 స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంపై జనవరి 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు సర్వే జరుపుతున్నారు. దీంతో నేటితో ఈ సర్వే చివరి రోజు కావడంతో లక్షకు పైగా పౌరులను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది.
నగరానికి మద్దతుగా నిలిచేందుకు పౌరులు ఓట్ ఫర్ యువర్ సిటీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో గ్రేటర్ హైదరాబాద్ను ఎంచుకుని నగరంపై అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని అధికారులు కోరారు. https//swachhsurvekshan2021.org/citizenfeedbackలో లాగిన్ అయి సెలెక్ట్ తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం, గ్రేటర్ హైదరాబాద్ను ఎంచుకోవాలి. లేదా ప్లే స్టోర్లో స్వచ్ఛత యాప్ డౌన్లోడ్ చేసుకుని హైదరాబాద్ స్వచ్ఛతలో తమ వంతుగా భాగస్వామ్యం కావాలని సూచించారు.