నగరాన్ని స్వచ్ఛతలో మేటిగా నిలిపేందుకు బల్దియా చర్యలు చేపట్టింది. స్వచ్ఛసర్వేక్షణ్-2023లో అగ్రస్థానమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నది. ఇందులోభాగంగానే 2794 యూనిట్ల డస్ట్ బిన్లను కొనుగోలు చేశారు. వీటిని వాణిజ్య ప్రాంతాల్లో వంద మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఇంటింటికీ చెత్త సేకరణకు ఇప్పటికే 4500 స్వచ్ఛ ఆటో టిప్పర్లను వినియోగిస్తున్నారు.
సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు వేగవంతం చేసింది. స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా ఇప్పటికే తడి, పొడి చెత్త నిర్వహణ, ఇంటింటి నుంచి చెత్త సేకరణ, కాలనీ, బస్తీ సంక్షేమ సంఘాల భాగస్వామ్యం, ఓడీఎఫ్కు చర్యలు, బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ చర్యలు, స్వచ్ఛతపై చైతన్య కార్యక్రమాలు, 50 మైక్రాన్ల కన్నా తక్కువ నిడివి ఉన్న ప్లాస్టిక్ నిషేధం వంటి కార్యక్రమాలు పక్కాగా చేపడుతున్నది.
ప్రధానంగా చెత్త కుండీలు లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దే క్రమంలో దాదాపు 22 లక్షల గృహాలకు తడి, పొడి చెత్త సేకరణకు 44 లక్షల చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఇంటింటికీ చెత్త సేకరణకు 4500 స్వచ్ఛ ఆటో టిప్పర్లను వినియోగిస్తున్నారు. తాజాగా, గ్రేటర్ వ్యాప్తంగా రద్దీగా ఉండే వాణిజ్య సంస్థల వద్ద పారిశుధ్య నిర్వహణ మరింత పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించారు. ఇందులోభాగంగానే కొత్తగా 2794 యూనిట్ల చెత్త డబ్బాల (స్వచ్ఛ బిన్లు)ను కొనుగోలు చేశారు. దుకాణాలు ఎక్కువగా ఉండే వాణిజ్య ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.