చర్యలు వేగవంతం ఇరువైపులా ఇంటింటి సర్వే
311 ప్రభావిత భవనాలు గుర్తింపు
చెల్లింపునకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు
వ్యక్తం చేస్తున్న స్థానికులు
ముషీరాబాద్, డిసెంబర్ 11: హుస్సేన్సాగర్ ప్రధాన నాలా విస్తరణ దిశగా అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. జీహెచ్ఎంసీ సర్కిల్-15 ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని సాగర్ నాలాకు ఇరువైపులా ఉన్న బస్తీల్లో ఇంటింటి సర్వే మొదలుపెట్టారు. నాలా విస్తరణ కారణంగా ప్రభావితమయ్యే భవనాలను గుర్తిస్తున్నారు. వరద ముంపు నివారణ దిశగా నాలాల విస్తరణ చేపట్టాలని గత ఏడాది ప్రభుత్వం నిర్ణయించింది. అవసరమైన చర్యలు మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన వివిధ విభాగాల అధికారులు చర్యలు చేపడుతున్నారు. నాలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను టౌన్ప్లానింగ్ ఏసీపీ పావని ఆధ్వర్యంలో సిబ్బంది, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు సర్వే చేపడుతున్నారు. నెల రోజులుగా హుస్సేన్ సాగర్ నాలా పరీవాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేసి ఇప్పటి వరకు 311 భవనాలు గుర్తించారు.
ముంపు సమస్యకు తావులేకుండా చర్యలు..
హుస్సేన్సాగర్ నాలా పరీవాహక ప్రాంతంలో వరద ముంపు సమస్యకు తావులేకుండా నాలాను విస్తరించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. వైస్రాయ్ హోటల్-అశోక్నగర్ నుంచి బాగల్లింగంపల్లి బ్రిడ్జి వరకు సాగర్ నాలాను విస్తరించడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పరిహారం తదితర అంశాలపై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
నాలాకు ఇరువైపులా 9 అడుగుల మేర విస్తరణ..
నాలాకు ఇరువైపులా 9 అడుగుల మేర విస్తరించడం, మరో తొమ్మిదేసి అడుగుల మేర స్థలసేకరణ చేయాలని ప్రతిపాదించారు. ఆమేరకు ప్రభావితమయ్యే ఇండ్లకు సంబంధించిన ఇంటి యాజమానులు ఎంతమంది ఉన్నది లెక్కవేస్తున్నారు.
311 భవనాల గుర్తింపు..
హుస్సేన్ సాగర్ నాలాకు ఇరువైపులా తొలగించాల్సిన 311 భవానాలను గుర్తించారు. వీటితోపాటు 5 హట్స్, 3 ప్రభుత్వ స్థలాలు, 204 వ్యక్తిగత పట్టా ప్లాట్స్ ఉన్నట్లు నిర్ధారించారు.