జూబ్లీహిల్స్, జనవరి 21: ‘ఇంటింటికీ ఆరోగ్యం’ అందరి బాధ్యత అని, ప్రతి ఇంటిలో సర్వే చేసి జ్వర లక్షణాలున్న వారికి వెంటనే హోమ్ ఐసొలేషన్ కిట్లు అందజేయాలని యూసుఫ్గూడ సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఎ.రమేశ్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏఎంఓహెచ్ డాక్టర్ బిందు భార్గవితో కలిసి ఫీవర్ సర్వేపై సిబ్బందికి దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా డీఎంసీ రమేశ్ మాట్లాడుతూ.. కొవిడ్ లక్షణాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ రెండు డోస్లతో పాటు బూస్టర్ డోస్ వేయించుకున్నారా.. లేదా.. పరిశీలించాలని సూచించారు. ప్రతి ఇంటిలో.. ప్రతి ఒక్కరూ విధిగా టీకాలు వేసుకోవాల్సిందేనని, ఏ ఒక్కరిని కూడా టీకా ఇవ్వకుండా వదిలేది లేదన్నారు. టీకాలు వేసుకోకుండా అలసత్వం వహిస్తే అందరికీ ప్రమాదమని గుర్తించాలన్నారు. ప్రభుత్వం సూచించిన మందులు వాడిన వారికి లక్షణాలు తగ్గకపోతే మెరుగైన చికిత్సకు తరలిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా రాజీవ్నగర్లో జీహెచ్ఎంసీ, వైద్య సిబ్బంది చేపడుతున్న సర్వేను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంటమాలజీ ఏఈ సావిత్రి, శానిటరీ సూపర్వైజర్ విజయ్, ఎస్ఎఫ్ఏలు, ఈఎఫ్ఏలు, యూసీడీ, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.
దగ్గు, జ్వరం లక్షణాలుంటే ఐసొలేషన్ కిట్
దగ్గు, జ్వరం లక్షణాలుంటే వెంటనే కొవిడ్ హోమ్ ఐసొలేషన్ కిట్ ఇవ్వాలని.. ఒక్కో ఆశ వర్కర్ల బృందం ప్రతిరోజు 30 నుంచి 50 గృహాలు సర్వే చేయాలని ఏఎంఓహెచ్ డాక్టర్ బిందు భార్గవి సూచించారు. శ్రీరాంనగర్ పీహెచ్సీలో వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లక్షణాలున్న వారి పేర్లు.. పూర్తి వివరాలతో నివేదికలు సిద్ధం చేయాలన్నారు. వారందరికీ కొవిడ్ కిట్లు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్ఎన్ మార్తమ్మ, ఏఎన్ఎంలు నాగవేణి, విజయకుమారి, వసంత కుమారి పాల్గొన్నారు.