గుమ్మడిదల, మార్చి 26: హోలీ పండుగను పురస్కరించుకుని చెరువు వద్ద ఫొటోషూట్ చేయడానికి వచ్చిన ఇద్దరు యువకులు చెరువులో మునిగి మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల సీఐ సుధీర్కుమార్, ఎస్సై మహేశ్వర్రెడ్డి వివరాల ప్రకారం.. సూరారం ప్రాంతానికి చెందిన శ్రావణ్కుమార్(17), శంకర్(22) స్నేహితులతో కలిసి సోమవారం హోలీ పండుగ సందర్భంగా బొంతపల్లి వీరన్నచెరువు వద్దకు ఈత కొట్టడానికి వచ్చారు. వీరు స్నేహితులతో మొబైల్తో ఫొటో షూట్ చేశారు. శ్రావణ్కుమార్, శంకర్ ఈత కొట్టేందుకు చెరువులో దిగి నీటమునిగారు. అక్కడున్న ఆంజనేయులు ఈ ఘటనపై శ్రావణ్ తండ్రి శ్రీనివాస్కు, శంకర్ తండ్రి వెంకటేశ్కు సమాచారమిచ్చాడు. వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రయినా వారి జాడ దొరకలేదు. దీంతో మంగళవారం ఉదయం నుంచి 11.30 వరకు గజ ఈతగాళ్లతో చెరువును గాలించి శ్రావణ్, శంకర్ మృతదేహాలను వెలికితీశారు.