ఖైరతాబాద్, సెప్టెంబర్ 27 : ఖైరతాబాద్లో కొలువుదీరిన శ్రీ దశ మహా విద్యాగణపతి నిమజ్జన ఘట్టం నేటితో ముగుస్తుంది. నవరాత్రుల పాటు అశేష భక్తజన కోటి పూజలందుకున్న స్వామి వారు నేడు గంగ ఒడికి చేరుకుంటారు. ఈ మేరకు ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ బుధవారమే అన్ని ఏర్పాట్లు చేసింది. 63 అడుగుల ఎత్తు 40 టన్నుల బరువున్న ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి అందుకు ప్రత్యేకమైన వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. గత 25 సంవత్సరాలుగా ఖైరతాబాద్ గణపయ్యకు సేవలందిస్తున్న రవి క్రేన్స్, ఎస్టీసీ ట్రాన్స్పోర్టు ట్రాలీ ఈ ఏడాది కూడా తమ సేవలను అందిస్తున్నది. గత నాలుగు రోజుల ముందే ట్రాలీని గణపతి మండపం వద్దకు చేర్చగా, రవి క్రేన్ అర్ధరాత్రి 1గంట ప్రాంతంలో స్వామి వారి చెంతకు చేరుకున్నది.
రథసారధుల ప్రత్యేకతలివే..
ఎస్టీసీ ట్రాన్స్పోర్టు ప్రతి ఏడాది ఆనవాయితీగా స్వామి వారికి భారీ ట్రాలీ సేవలను ఉచితంగా అందజేస్తున్నది. 150 టన్నులను మోసే సామర్థ్యం కలిగిన 26 టైర్ల ట్రాలీ అత్యాధునిక బ్రేకింగ్ సిస్టమ్ కలిగి ఉన్నదని డ్రైవర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. 40 టన్నులకు పైగా బరువున్న ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని సాఫీగా తరలించేందుకు అత్యాధునిక వ్యవస్థ కలిగి ఉన్నది. అలాగే స్వామి వారి విగ్రహాన్ని ట్రాలీపై ఉంచి రవి క్రేన్స్ 150 టన్నులను అవలీలగా పైకి ఎత్తుతుంది. ఇక తుది ఘట్టానికి వినియోగించే సూపర్ క్రేన్స్కు మరిన్ని ప్రత్యేకలు ఉన్నాయి. ఇది ఏకంగా 250 టన్నుల బరువును మోసే సామర్థ్యం కలిగి ఉంది. 14 టైర్లతో కూడిన ఈ క్రేన్ హైడ్రాలిక్ బూమ్ 50 మీటర్ల ఎత్తు వరకు విగ్రహాన్ని తీసుకెళ్లగలదు. ఖైరతాబాద్ గణపతి నిమజ్జనానికి ఈ క్రేన్ను వినియోగిస్తున్నారు.
క్రేన్ నం.4 వద్దే స్వామి వారి నిమజ్జనం..
ఖైరతాబాద్ గణనాథుడు శోభాయాత్ర ద్వారా ఎన్టీఆర్ మార్గ్లోని నిమజ్జన ఘాట్కు చేరుకుంటాడు. దశాబ్దాలుగా ఖైరతాబాద్ గణపతిని ఎన్టీఆర్ మార్గ్లోని క్రేన్ నం.4 వద్దే నిమజ్జనం చేయడం ఆనవాయితీ. ఈ ఏడాది కూడా స్వామి వారి 63 అడుగుల భారీ విగ్రహాన్ని ఇక్కడే నిమజ్జనం చేస్తారని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.