వెంగళరావునగర్, ఆగస్టు 15 : జాతీయస్థాయిలో క్రీడాకారులను అందించిన ఘనత హైదరాబాద్దేనని భారత మాజీ క్రికెటర్ సునీల్ జోషి అన్నారు. మంగళవారం హైదరాబాద్ రహ్మత్నగర్ డివిజన్ ఎస్పీఆర్హిల్స్ గ్రౌండ్స్లో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా నెల రోజులుగా నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా భారత మాజీ క్రికెటర్ సునీల్ జోషి మాట్లాడుతూ మహ్మద్ సిరాజ్, వీవీఎస్ లక్ష్మణ్, అజారుద్దీన్ భాగ్యనగర క్రీడాకారులని.. అంతర్జాతీయస్థాయిలో మంచి క్రీడాకారులుగా రాణించారని అన్నారు. ఇండియా టీంకు బెస్ట్ బౌలర్గా మహ్మద్ సిరాజ్ ప్రతిభను చాటుతున్నాడని పేర్కొన్నారు. క్రికెట్ మాత్రమే కాకుండా ఇతర క్రీడల్లోనూ హైదరాబాద్కు చెందిన గోపీచంద్, సైనా నెహ్వాల్, సింధు, సానియామిర్జా సత్తా చాటి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారన్నారు. అత్యంత క్రేజ్ ఉన్న క్రికెట్ టోర్నమెంట్స్ను ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే సమయంలో నిర్వహించాలన్నారు. ఎస్పీఆర్హిల్స్ గ్రౌండ్స్ను చూస్తుంటే హిమాచల్ప్రదేశ్ గుర్తుకువస్తుందని కితాబిచ్చారు. మహిళలకు క్రికెట్లో నిషేధమేమీ లేదని.. మహిళలు కూడా క్రికెట్తో పాటు ఇతర ఆటల్లో తమ ప్రతిభను చాటాలని సూచించారు. క్రీడాకారుల కోసం ఇంత మంచి గ్రౌండ్స్ను అందుబాటులోకి తెచ్చి.. క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను అభినందించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని హెచ్సీయూ పర్యవేక్షణలో క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించామని తెలిపారు. సీఎం కేసీఆర్ క్రీడారంగానికి ఎంతో సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేత జట్టుకు రూ.లక్ష, రన్నరప్ జట్టుకు రూ.50వేలు, సెమీ ఫైనల్ జట్టుకు రూ.30 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేదీప్య రావు, రాజ్ కుమార్ పటేల్, సీ.ఎన్.రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ, ప్రదీప్,అప్పుఖాన్, సంతోష్ ముదిరాజ్, నాయకులు విజయ్కుమార్, తన్నుఖాన్, నజీర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.