ఖైరతాబాద్, జనవరి 28 : రచయిత కల్లూరి భాస్కరం రచించిన ‘ఇవీ మన మూలాలు’ పుస్తకం చదివితే అన్ని గ్రంథాలు చదివిన అనుభూతిని కలిగిస్తుందని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ‘ఇవీ మన మూలాలు’ పుస్తకాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించి, తొలిప్రతిని సీనియర్ సంపాదకుడు కె. రామచంద్రమూర్తికి అందజేశారు. సాహితీవేత్త, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వాడ్రేవు చినవీరభద్రుడు పుస్తక సమీక్ష చేయగా, విద్యావేత్త, రచయిత బీపీ పడాల పుస్తక పరిచయం చేశారు.
ఈ సందర్భంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పుస్తకం ద్వారా రచయిత చేసిన సత్యాన్వేషణ అరుదైన ఆభరణమన్నారు. ఈ పుస్తకంపై అధ్యయనం జరగాలని, పురావస్తు శాఖ, శాస్త్రవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి చర్చించాలన్నారు. ఈ కార్యక్రమంలో కవయిత్రి, రచయిత్రి కుప్పిలి పద్మ, రచయిత, రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి పంజుగుల, పలువురు సాహితీవేత్తలు, రచయితలు పాల్గొన్నారు.