Hyderabad | సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): భానుడి ప్రతాపానికి గ్రేటర్లో వాతావరణం రోజురోజుకు వేడెక్కుతున్నది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడంతో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం నుంచి రాత్రి గ్రేటర్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 5.4డిగ్రీలు పెరిగి 37.4డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 6.7డిగ్రీలు పెరిగి 24.7డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతో ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఇదిలా ఉండగా ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు నగరంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.