ఖైరతాబాద్, ఏప్రిల్ 20 : దుబాయి, మలేషియా, సింగ్పూర్ తరహాలో అండర్ వాటర్ టన్నెల్ నగరవాసులను ఆహ్లాదపర్చనున్నది. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో ఈనెల 23న ప్రారంభం కానున్న సమ్మర్ ఉత్సవ్ మేళాలో అండర్ వాటర్ టన్నెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. గురువారం పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వాహకుడు రఫీక్ వివరాలు వెల్లడించారు. అండర్ వాటర్ టన్నెల్ నగరంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో పసిఫిక్ హిందూ మహాసముద్రంలో నివసించే అరుదైన అరిపమా,
పీరానా, రెడ్ టేయిల్ క్యాట్ ఫిష్, స్రింగ్ రే, ఫెథర్ ఫిష్, పికాక్ బాస్, బ్లాక్, సిల్వర్ షార్క్తోపాటు సుమారు 650 రకాల చేపలు ఈ టన్నెల్లో అబ్బురపరుస్తాయని, 180 డిగ్రీల్లో టన్నెల్లో వాటిని వీక్షించవచ్చన్నారు. దీంతో పాటు చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు హ్యాండ్లూమ్ ఎక్స్పోను ఏర్పాటుతోపాటు హైదరాబాద్ రుచులు అందుబాటులో ఉంటాయని, మొత్తం 250 స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నామని, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందని చెప్పారు. ప్రారంభోత్సవానికి మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్లను ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు.