మట్టి బొమ్మలు, కుండలు, చిత్రకళలో శిక్షణ పొందిన చిన్నారులు
కొండాపూర్, మే 31: మాదాపూర్లోని శిల్పారామంలో పదిహేను రోజులుగా కొనసాగుతున్న ‘సమ్మర్ ఫెస్టివల్’ క్యాంపు మంగళవారం ముగిసింది. క్యాంపులో పాల్గొన్న 65 మంది చిన్నారులు, పెద్దవాళ్లు మట్టి బొమ్మలు, కుండలు, ఆక్రిలిక్, మధుబని పెయింటింగులలో శిక్షణ పొందడంతో పాటు భగవద్గీత శ్లోకాలను అభ్యసించారు.
చివరి రోజున క్యాంపులో పాల్గొన్న వారు స్వయంగా తయారు చేసిన పలు వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. శిక్షణ పొందిన వారందరికీ శిల్పారామం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఇంజినీర్ కన్సల్టెంట్ అంజిరెడ్డిలు ప్రశంసా పత్రాలను అందజేశారు. తక్కువ సమయంలో మెరుగైన శిక్షణను నేర్చుకున్న చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సమ్మర్ ఫెస్టివల్ క్యాంపునకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. భవిష్యత్తులోను ఈ క్యాంపు కొనసాగుతుందని, ఔత్సాహికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.