సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహణకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. వేసవిలో ఆరు నుంచి 16 సంవత్సరాల పిల్లల్లో క్రీడా నైపుణ్యతను పెంపొందించి నిష్ణాతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఏటా వేసవి శిక్షణ తరగతనులను నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఈ ఏడాది వచ్చే నెల 25వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపులు-2023లను నిర్వహించనున్నారు. ఈ మేరకు తేదీల వారీగా షెడ్యూల్ ప్రకటించారు. ఔట్డోర్, ఇండోర్ స్పోర్ట్స్తో పాటు పెయింటింగ్ తదితర మనోవికాసాన్ని పెంచే ఫన్నింగ్ గేమ్స్లు కలిపి మొత్తం 44 రకాల క్రీడలపై శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నది. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, గేమ్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షణలో ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ నెల 26వ తేదీ నుంచి 31 వరకు అసిస్టెంట్ డైరెక్టర్లు, గేమ్స్ ఇన్స్పెక్టర్లు, ప్లేయర్లు, కోచ్లు, పార్ట్ టైం కోచ్లతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
ఆరు జోన్లకుగానూ వచ్చే నెల 6వ తేదీన ఉదయం 9 గంటలకు క్రీడా సామగ్రిని పంపిణీ చేయనున్నారు. ఎల్బీనగర్ జోన్కు సంబంధించి జీహెచ్ఎంసీ ఉప్పల్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు క్రీడా సామగ్రిని పంపిణీ చేయనున్నారు. చార్మినార్కు మొఘల్పుర స్పోర్ట్స్ కాంప్లెక్స్లో, ఖైరతాబాద్ జోన్కు జీహెచ్ఎంసీ రెడ్హిల్స్, కూకట్పల్లి/శేరిలింగంపల్లికి పీజేఆర్ చందానగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలో, సికింద్రాబాద్కు సంబంధించి జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ ఫూల్ వద్ద క్రీడా సామగ్రిని అందజేస్తారు.
పదో తరగతి- ఇంటర్ సెంటర్స్కు మే 15 నుంచి 19వ తేదీ వరకు టోర్నమెంట్స్
బాస్కెట్బాల్, బ్యాట్మింటన్, బాక్సింగ్, క్రికెట్, చెస్, క్యారమ్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, కబడ్డి, రోలర్ స్కేటింగ్, సిపాక్ త్రో, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, టెన్నికోట్, వాలీబాల్ కలిపి మొత్తం 16 రకాల క్రీడా టోర్నమెంట్లను నిర్వహించనున్నారు.