సుల్తాన్ బజార్, ఆగస్టు 5: తీవ్ర రక్తస్రావం, బీపీ, పల్స్ పడిపోయి కోమాలోకి వెళ్లిన నిండు గర్భిణికి అరుదైన ఎక్స్ప్లోరేటరీ లాపరోటమీ శస్త్ర చికిత్సను నిర్వహించి సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖాన వైద్యులు ప్రాణాలను కాపాడారు. నల్లగొండ జిల్లా, తీట కుంట – పామర్లచెర్లకు చెందిన సత్యవతి(27), నాగేశ్లు భార్యా భర్తలు. కాగా, సత్యవతికి మూడో కాన్పులో భాగంగా 31 వారాలకే తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో స్థానిక ప్రభుత్వ దవాఖానలో చూపించగా, అక్కడి వైద్యులు సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానకు తీసుకు వెళ్లాలని సూచించారు. దీంతో సత్యవతిని జూన్ 21న దవాఖానలో అడ్మిట్ చేశారు. ఇదిలా ఉండగా, వైద్యులు సత్యవతిని పరిశీలించి తీవ్ర రక్తస్రావం అవుతున్నందని గుర్తించారు.
కాగా, గర్భిణికి 31 వారాలే అవుతుండటం, ఇంకా ఏడు వారాలు మిగిలి ఉండటంతో వైద్యులు దవాఖానలో ఉంచి వైద్య చికిత్సలు అందించారు. కాగా, బుధవారం తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో సత్యవతికి పురుటి నొప్పులు అధికం కావడంతో విధుల్లో ఉన్న వైద్యులు సిజేరియన్ ద్వారా ప్రసవం చేశారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నప్పటికీ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో సత్యవతి బీపీ, పల్స్ పడిపోయి కోమాలోకి వెళ్లింది. విషయాన్ని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కె.రాజ్యలక్ష్మి దృష్టికి తీసుకువెళ్లగా, ఆమె సత్యవతిని పరిశీలించి రెండున్నర గంటల పాటు శ్రమించి రెండు లీటర్ల అంతర్గత రక్తస్రావాన్ని తొలగించి 13 యూనిట్ల రక్తాన్ని ఎక్కించి ఆమెకు ఎక్స్ప్లోరేటరీ లాపరోటమీ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి ప్రాణాలను కాపాడినట్లు డాక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు.