అమీర్పేట్:ఎటువంటి సమస్యలకు కూడా ఆత్మహత్యలు పరిష్కారం చూపవని హోంమంత్రి మహమూద్ అలీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. క్షణికావేశాల్లో తీసుకునే ఆత్మహత్యల నిర్ణయం కంటే.. మనోస్థెర్యంతో వాటిని ఎదుర్కొనే దిశగా వేసే ముందడుగు ఎంతో గొప్పదని వారన్నారు. స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అమీర్పేట్లోని హోటల్ మారీగోల్డ్లో ‘సూసైడ్ ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అండ్ నాలెడ్జ్ (స్పీక్)’అనే అంశంపై విద్య, వైద్య, రాజకీయ, ఆధ్యాత్మిక, సినీ, వ్యాపార, న్యాయ, కళారంగాలతో పాటు అనేక రంగాలకు చెందిన మేధావులతో సదస్సు జరిగింది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్లు వర్చువల్ విధానంలో ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. హెచ్ఆర్సీ ఛైర్మన్ జస్టిస్ చంద్రయ్య, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, మాజీ ఐఎఎస్ అధికారి బి.లక్ష్మికాంతం, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మినారాయణ, భారతీయం సత్యవాణి, ఇ-గురుకులం నిర్వహకులు విద్యావేత్తలు ఆకెళ్ల రాఘవేంద్ర, వాసిరెడ్డి అమర్నాథ్రెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్రావు, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అల్కా మనోజ్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మహత్యల నివారణ కోసం స్పందన ఫౌండేషన్ నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు చక్కటి మార్పుకు శ్రీకారం చుడుతున్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు. స్పందన ఈద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ ఈద శామ్యూల్రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన స్పందన ఫౌండేషన్ పుస్తకాన్ని సదస్సులో ఆవిష్కరించారు.